యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేల కొనుగోళ్ల కుట్రపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాతో ప్రమాణం చేయించగలరా? అని విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. ప్రమాణం చేయాలని బండి సంజయ్ను ఎవరడిగారని, ఆయన ఎవరు తరఫున ప్రమాణం చేస్తున్నారని ప్రశ్నించారు. అసలు దొంగలు, సూత్రధారులు ఎవరో త్వరలో తేలుతుందని చెప్పారు. అప్పుడు బీజేపీ నేతలు ఏమి మాట్లాడుతారో, ముఖాలు ఎక్కడ పెట్టుకొంటారో, ఏమని ప్రమాణాలు చేస్తారో చూద్దామని అన్నారు. శుక్రవారం ఆయన నల్లగొండ జిల్లా చండూరు మండలం బంగారిగడ్డలో ఈ నెల 30న నిర్వహించనున్న సీఎం కేసీఆర్ బహిరంగసభ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకొన్నట్టుగా బండి సంజయ్ ఎందుకు ఉలికిపడుతున్నారని నిలదీశారు. ఎందుకు ఉరికిఉరికి ప్రమాణాలు చేస్తున్నారో ప్రజలకు అర్థం అవుతున్నదని చెప్పారు. బహిరంగంగా పట్టబడిన దొంగ ప్రమాణాలకు మించి ఇంకేమీ చేయలేరని ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలు ఎన్ని దొంగ ప్రమాణాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. దేవుళ్లను, బాబాలను రాజకీయాలకు ఉపయోగించే పార్టీ బీజేపీ అని అన్నారు.
బీజేపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలే
త్వరలో ఒక్కొక్కటిగా కొనుగోలు ముచ్చట్ల నిజాలన్నీ బయటకు వస్తాయని, బీజేపీ ప్రజల ముందు దోషిగా నిలబడుతుందని జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించిన బీజేపీ నేతలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చి 2,500 రోజులైందని, జనరల్ ఎలక్షన్స్లో ఇచ్చిన హామీలకే దిక్కు లేదని, ఉప ఎన్నిక హామీలను ఎవరు నమ్ముతారని ఎద్దేవా చేశారు. అమిత్షా మునుగోడుకు వచ్చి చెప్పిన ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం అమలు చేశారని, అందులోనూ బొక్కబోర్లా పడ్డారని దుయ్యబట్టారు.
మునుగోడులో టీఆర్ఎస్దే విజయం
బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్దే విజయమని జగదీశ్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అన్యాయంపై తిరుగుబాటు చేసే అలవాటు ఉన్న ఈ నియోజకవర్గం ప్రజలు గతంలో 400 మంది పోటీ చేసినా.. తమకు ఇష్టమైన కమ్యూనిస్టు నేత ధర్మభిక్షంను గెలిపించుకొన్నారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలిరావాలని జగదీశ్రెడ్డి విజ్ఞప్తి చేశారు. అనేక గ్రామాల ప్రజలు పాదయాత్రతో వస్తామని, వాహనాలు అవసరంలేదని చెప్తున్నారని పేర్కొన్నారు.