Minister Jagadish Reddy | ఆర్థిక స్థోమత లేకనే తెలంగాణకు రుణాలు ఆపామంటూ కేంద్రమంత్రి ఆర్కే సింగ్ చేసిన వ్యాఖ్యలు విద్యుత్ మంత్రి జగదీశ్రెడ్డి ధ్వజమెత్తారు. ఈ వ్యాఖ్యలు శతాబ్దంలోనే అతిపెద్ద అబద్ధమని విమర్శించారు. ఎర్రగడ్డ జెన్కో కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రైతుల మోటర్లకు మీటర్లు పెట్టలేదని తాము చెప్పలేదంటూ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. మీటర్లు పెట్టనందుకే నిధులు అపుతున్నామని కేంద్రం పంపిన ఉత్తరాలను ఎన్నోసార్లు ప్రభుత్వం ముందుంచామన్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలు చేసే పనులతో దేశానికి తీరని ద్రోహం జరుగుతుందని ఆరోపించారు. తీసుకున్న రుణాలను తిరిగి చెల్లిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందుందని, దమ్ముంటే ఏ ఒక్క సంస్థ దగ్గరైనా పేమెంట్ ఆలస్యమైందో ఆర్కే సింగ్ చూపించాలని సవాల్ విసిరారు.
తెలంగాణకు న్యాయంగా ఇవ్వాలని వాటా ఇవ్వకుండా.. రాష్ట్ర పేమెంట్ విధానికి ముగ్ధులై రుణాలు ఇచ్చేందుకు వచ్చిన ఆర్థిక సంస్థలను ఇవ్వకుండా భయపెడుతూ దుర్మార్గంగా కేంద్రం, మంత్రి ఆర్కేసింగ్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ నాయకత్వంలో అన్నిరంగాల్లో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి సైతం కావాలంటూ బీజేపీ పాలితరాష్ట్రాల్లోని ప్రజల నుంచి వస్తున్న డిమాండ్తోనే బీజేపీ నేతలు అసత్యపు వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్ని అబద్ధాలు చెప్పినా కేసీఆర్ లక్ష్య శుద్ధిని ఆపలేరని స్పష్టం చేశారు. పైసలు ఇవ్వమంటూ భయపెట్టే ధోరణిలో ఆర్కే సింగ్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ సమాజం మరిచిపోదని, వాటా ఇవ్వకపోవడానికి తెలంగాణ ఆర్కే సింగ్ జాగీర్ కాదన్న మంత్రి.. తెలంగాణ ప్రజల హక్కు అన్నారు.
ప్రజలు చెల్లించిన పన్నులే అడుగుతున్నామని.. కొత్తగా ఏమీ అడగట్లేదన్నారు. తెలంగాణలో బీజేపీకి దిక్కులేదనే అక్కసుతో కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. దేశంలో మిగులు విద్యుత్ ఉన్నదనేది పెద్ద జోక్ అని, మిగులు విద్యుత్ ఉంటే ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్లో కరెంటు కోతలు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. రాత్రిపూట కరెంటు వాడితే 25శాతం సర్ఛార్జ్ విధిస్తామని కేంద్ర మంత్రి హోదాలో ఆర్కేసింగ్ చేసిన వ్యాఖ్యలు నిజం కాదా? అంటూ ప్రశ్నించారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా 24 గంటల కరెంటు ఇచ్చి తీరుతామని మంత్రి స్పష్టం చేశారు. అబద్ధాలు చెప్పే నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరని, అబద్ధాలు చెప్పేవారి ఎలా బుద్ధి చెప్పాలో తెలంగాణ ప్రజలు తెలుసునన్నారు.