సూర్యాపేట: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొంగ జపం చేస్తుండగా, బీజేపీ దొంగ జపం చేస్తున్నదని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish Reddy) మండిపడ్డారు. ప్రజల బాగుకోసం కాకుండా అధికారమే పరమావదిగా ఆ పార్టీలు పనిచేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రభుత్వం చేపట్టిన దశాబ్ది ఉత్సవాలపై బీజేపీ, కాంగ్రెస్ల ధోరణిని తీవ్రంగా దుయ్యబట్టారు. అధికారం కోసం జరుగుతున్న పరుగు పందెంలో బీఆర్ఎస్ (BRS) పార్టీతో పోటీ పడేందుకే దశాబ్ది ఉత్సావాలను రాజకీయం చేయాలనుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఉద్యమ సమయంలో రాజీనామాలు అంటేనే తోకముడిచిన ఆ రెండు పార్టీలకు దశాబ్ది ఉత్సవాల గురించి మాట్లాడే నైతికత ఎక్కడిదని ప్రశ్నించారు. తెలంగాణను చీకట్లోకి నెట్టిన కాంగ్రెస్ ఆవిర్భావ ఉత్సవాలను ఎలా చేస్తుందని నిలదీశారు.
తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే బీజేపీకి ఆవిర్భావ ఉత్సవాలు చేసే అర్హత ఉందా అని ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలోకి రాగానే 500 మెఘావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంతో సహా ఏడు మండలాలను ఆంధ్రలో కలిపిన ఆ పార్టీకి తెలంగాణ గురుంచి మాట్లాడే హక్కు ఏక్కడదని ఫైరయ్యారు. రాష్ట్రం కోసం రాజీనామా చేయమంటే పారిపోయిన కిషన్ రెడ్డి (Kishan reddy).. ఇప్పుడు తెలంగాణపై మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటున్నారని విమర్శించారు.
తొమ్మిదేండ్లలో ఊహకు మించిన అభివృద్ధిని సాదించుకున్నందుకే దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అంతటి అభివృద్ధిలో భాగస్వామ్యమైన బీఆర్ఎస్ శ్రేణులు దశాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో వెలుగు జిలుగులు విరజిమ్ముతున్నాయని తెలిపారు. వరిదిగుబడిలో సాధించిన విజయాలు సీఎం కేసీఆర్ పాలనా దక్షతకు తార్కాణమని మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు.