హైదరాబాద్ : దిక్కులేని నావలా కాంగ్రెస్ పార్టీ మారిందని, ఆ పార్టీతో ఎవరూ పొత్తులు పెట్టుకోరని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్పై మంత్రి ఘాటుగా స్పందించారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీ దొంగ పార్టీలనీ.. ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా దేశంలో కేసీఆర్ కొత్త మోడల్తో అభివృద్ధికి శ్రీకారం చుడుతారన్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన వరంగల్ డిక్లరేషన్ సభ బూమరాంగ్ అయ్యిందని ఎద్దేశా చేశారు. వరంగల్ సభ ఆధిపత్య ఘర్షణ తప్ప.. రైతులకు ఒరిగిందేమీ లేదన్నారు. డిక్లరేషన్లో కాంగ్రెస్ గత ఎన్నికల ముందు చెప్పిన విషయాలే మళ్లీ ఇప్పుడు కొత్తగా చెప్పిందన్నారు.
రాష్ట్ర నాయకుల స్క్రిప్ట్ చదవడం తప్ప రాహుల్ గాంధీ తెలంగాణకు కొత్తగా చెప్పిందేమీ లేదన్నారు. అసలు రాహుల్ గాంధీ ఏ హోదాలో డిక్లరేషన్ చేశారని, అది తెలంగాణకు పరిమితమా? లేదంటే జాతీయా విధానామా? చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణాలో బలం లేదని, పార్టీని నడపలేక పారిపోయిన రాహుల్ చేసిన డిక్లరేషన్ను ప్రజలు పట్టించుకోరన్నారు. ఛత్తీస్గఢ్లో రైతులకు మద్దతు ధర లభించక అక్కడి రైతులు తెలంగాణ మిల్లులకు వచ్చి ధాన్యం అమ్ముకొని వెళ్తున్న విషయాన్ని మంత్రి జగదీశ్రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ గురించి కాంగ్రెస్ మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లేనని, కాంగ్రెస్ కొంగ జపాలకు రాష్ట్ర ప్రజలు మోసపోరన్నారు.