Minister Jagadish Reddy | మోటర్లకు మీటర్లు పెట్టాలని మోదీ సర్కారు తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకడ్ల జగదీశ్రెడ్డి అన్నారు. కేంద్రం మాట విననందుకు రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన రూ.30వేలకోట్ల నిదులను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లగొండ నియోజకవర్గ పరిధిలోని తిప్పర్తి మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఆత్మీయ సదస్సుకు మంత్రి మంతి హాజరై మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ ఇన్చార్జి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, బీఆర్ఎస్ అధ్యక్షుడు రవీంద్ర నాయక్, తుంగతుర్తి ఎమ్మెల్యే గాధరి కిశోర్ కుమార్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థలను ఊరకుక్కల్లా ఉసి గొల్పుతున్నారని విమర్శించారు. అసత్య ఆరోపణలు, అబద్ధాలు ప్రచారం చేస్తున్న బీజేపీ పాలకులు తెలంగాణలో అభివృద్ధి నిరోధకులుగా మారారని ధ్వజమెత్తారు. నల్లగొండ నియోజకవర్గ పరిధిలో స్థానిక శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాకే అభివృద్ధి మొదలైందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ఎన్నికల వేళ ఊళ్లలోకి వచ్చాయని, మాయమాటలతో ఉరేగాలని చూస్తూన్నారన్నారు.
ఆ పార్టీల నేతలు ఏ మొహం పట్టుకుని వస్తున్నారంటూ నిలదీశారు. వ్యవసాయానికి పెట్టుబడిసాయంగా రైతుబంధు పథకం కింద సీఎం కేసీఆర్ ఎకరాకు అందిస్తున్న రూ.10 వేలను రూ.20వేలకు పెంచుతారా? కల్యాణలక్ష్మిలో అందించే మొత్తాన్ని రెట్టింపు చేస్తారా? అని ఆయా పార్టీల నేతలను నిలదీయాలని మంత్రి పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సంక్షేమ పథకాల ఊసే ఉండదని, అలాంటి పార్టీలకు చోటు కల్పించొద్దని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ విజయ దుందుభి మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 12 నియోజకవర్గాల్లో విజయకేతనం ఎగురవేస్తుందని స్పష్టం చేశారు.