నల్లగొండ : తెలంగాణ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్పై విషం చిమ్మేలా మోదీ వ్యాఖ్యానించారని మండిపడ్డారు. మునుగోడులో ఓటమి చెందిందనే మోదీ తన అక్కసును వెళ్లగక్కారని పేర్కొన్నారు. వడ్డీతో సహా ఇస్తారన్న మీకే ప్రజలు తిరిగి చెల్లిస్తారని పేర్కొన్నారు. బ్యాంకు లోన్లు రాకుండా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుని, టీఆర్ఎస్ పార్టీలో అలజడి చేసేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ ప్రజలు మోస పోవడానికి గుజరాత్ ప్రజల్లాంటి వారు కాదని మంత్రి స్పష్టం చేశారు. నాయకులు, పార్టీలను భయపెట్టి ఎదురు లేకుండా చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తుందన్నారు. కేసీఆర్పై విషం కక్కినా తెలంగాణ ప్రజలు హంసల్లాంటి వారు. నీళ్లు.. పాలను వేరు చేసినట్లు విషాన్ని కూడా వేరు చేస్తారని తెలిపారు. దేశంలో బీజేపీ పీడను వదిలించుకునేందుకు కేసీఆర్ నాయకత్వంలో మరింతగా ముందుకు పోతామని తేల్చిచెప్పారు. అబద్ధాల పునాదుల మీద పార్టీ విస్తరణకు ప్రధాని ప్రయత్నం చేస్తున్నారని జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు.