హైదరాబాద్ : ప్రధాని మోదీ మోసం బట్టబయలైందని, జాతీయ పేరుతో దేశ ద్రోహానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఒకరిద్దరి కోసం దేశ సంపదను కట్టబెట్టేందుకు మోదీ సర్కారు ప్రణాళికలు రూపొందించిందని ఆరోపించారు. ఆ విషయాన్ని దేశ ప్రజలు గ్రహిస్తున్నారని, సరైన సమయంలో గుణపాఠం చెప్పేందుకు సన్నద్ధమవుతున్నారన్నారు. బంజారాహిల్స్లోని మంత్రుల నివాస ప్రాంగణంలో నకిరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్చే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్, సీపీఎం నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ యావత్ భారతదేశానికి ప్రస్తుతం కేసీఆర్ నాయకత్వమే శరణ్యమన్నారు.
మోదీపై విశ్వసనీయత కోల్పోయిన దేశ ప్రజలు సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వైపు చూస్తున్నారన్నారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నేతృత్వంలో సాగుతున్న పాలనపై దేశ ప్రజలకు నమ్మకం ఏర్పడిందన్నారు. వ్యవసాయ రంగంతో పాటు విద్యుత్, సాగు, తాగునీటిరంగంలో సాధించిన విజయాలతో పాటు ఇక్కడ అమలవుతున్న సంక్షేమ పథకాలపై ఆసక్తిని పెంచుకున్న దేశ ప్రజలు రేపటి ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోనీ బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధమవుతున్నారన్నారు. పార్టీలో చేరిన చందుపట్ల, చందంపల్లి, ఈదులూరు ఎంపీటీసీలు ఇడమడపాక లక్ష్మి, బోయిల్ల శేఖర్, తవిడబోయిన భవానీ, నోముల ఉప సర్పంచ్ శ్రీనివాస రెడ్డి, సీఎంపీ సీనియర్ నేత భీమనబోయిన యాదగిరి ఉన్నారు. ఈ సందర్భంగా వారందరికీ మంత్రి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.