నల్లగొండ : తెలంగాణ రైతులకు ఎలాంటి నష్టం జరగనివ్వం అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ నల్లగొండ జిల్లా కేంద్రంలో చేపట్టిన టీఆర్ఎస్ నిరసన దీక్షలో మంత్రి జగదీశ్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో నంబర్ వన్ స్థానంలో నిలిచిందన్నారు. దీంతో కేంద్రానికి గుబులు పుడుతోందన్నారు. సంక్షేమం, అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణపై కేంద్రం కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. ఫ్యూడల్ విధానంతో బీజేపీ దరిద్రపు పాలన చేస్తుందని నిప్పులు చెరిగారు. నిత్యం ఎక్కడో ఒక చోట మతకల్లోలాలు సృష్టించడమే బీజేపీ రాజకీయ విధానం అని కోపోద్రిక్తులయ్యారు.
ఆహార భద్రతా చట్టానికి కేంద్రం తూట్లు పొడుస్తున్నది. కేంద్రం చేతకాని తనం వల్లే అన్నదాతలు బాధపడుతున్నారని ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోళల్లో కేంద్రం దొంగాట ఆడుతున్నది. మాట మార్చి కేంద్రం రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నదని మండిపడ్డారు. రాష్ట్ర బీజేపీ నాయకత్వం వరి వేయండి కొంటాం అన్నారు. అమాయక రైతులను బీజేపీ నాయకులు తప్పుదోవ పట్టించి, ఇవాళ ముఖం చాటేశారని దుయ్యబట్టారు. కేసీఆర్ ఉండగా అన్నదాతలకు ఎలాంటి నష్టం జరగదు. టీఆర్ఎస్ పార్టీ అంటేనే రైతుల పార్టీ.. ఈ పార్టీ రైతుల కోసమే పుట్టిందని మంత్రి జగదీశ్ రెడ్డి తేల్చిచెప్పారు.