నల్లగొండ : దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. విపక్షాల గొంతులు నొక్కేందుకే బీజేపీ ఆధ్వర్యంలోనీ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను వినియోగిస్తుందని ఆయన ఆరోపించారు. గురువారం మధ్యాహ్నం నల్లగొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన వామపక్ష పార్టీల సమన్వయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
సీపీఎంకు చెందిన మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీపీఐకి చెందిన మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి, ఉజ్జిని యాదగిరి రావులతో పాటు సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, యాదాద్రి జిల్లా కార్యదర్శి జహంగీర్, సీపీఐ నల్లగొండ, యాదాద్రి జిల్లా కార్యదర్శులు నెల్లికంటి సత్యం, గోదా శ్రీరాములు, టీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎన్నికల ఇంచార్జ్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి వామపక్షాలతో కలసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దేశ సమగ్రతకు భంగం కలిగే రీతిలో నిర్ణయాలు తీసుకుంటున్న బీజేపీని నిలువరించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. శాంతియుత వాతావరణాన్నీ చెడగొడుతూ ప్రజల మధ్య విచ్ఛిన్నానికి బీజేపీ కుట్రలు పన్నుతోందని ఆయన దుయ్యబట్టారు. అంతటితో ఆగని మోదీ సర్కార్ తెలంగాణాతో సహా బీజేపీయేతర రాష్ట్రాలలో అభివృద్ధి, సంక్షేమానికి అడ్డుపడుతుందని ఆయన మండిపడ్డారు.
బీజేపీని నిలువరించాల్సిన అవసరం ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నికల రూపంలో వచ్చిందన్నారు. ఆ శక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీకే ఉందన్నారు. అందుకు తోడ్పాటునందించే ప్రగతిశీల శక్తులను కలుపుకొని పోవాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమన్నారు. అందుకు మునుగోడు ఉప ఎన్నికలనే వేదికగా ఎంచుకొని వామపక్షాలతో కలసి బీజేపీపై పోరాటానికి శ్రీకారం చుట్టమన్నారు. దేశంలో కాంగ్రెస్ బలహీన పడిందని బీజేపీని బలంగా వ్యతిరేకించే శక్తులను కలుపుకోవడంలో భాగంగ వామపక్షాలతో కలసి పోరాటం చేయాలని నిర్ణయించామన్నారు. అందుకు అవసరమైన సమన్వయం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. పట్టణాల నుంచి మొదలుకొని మారుమూల కుగ్రామం వరకు ఈ సమన్వయం కొనసాగుతుందని మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు.