సూర్యపేట : రాష్ట్ర అసెంబ్లీలో గవర్నర్ చేసిన ప్రసంగాన్ని వ్యతిరేకించిన బీజేపీ నాయకుల వ్యాఖ్యలపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ను అవమానించినట్టే రాజ్యాంగ సంస్థలను , రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారి గౌరవాన్ని బీజేపీ నాయకులు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సూర్యపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు.
గవర్నర్ ప్రసంగాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో స్పష్టం చెప్పాలని డిమాండ్ చేశారు. గవర్నర్ తో అబద్దాలు మాట్లాడించామంటున్న బీజేపీ నేతలు ఇన్ని రోజులు వారు అబద్దాలు మాట్లాడించారని తాము భావించాలా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో అబద్దాలు చెప్పారన్న బీజేపీకి గవర్నరే సమాధానం చెప్తారని వెల్లడించారు. బీజేపీ కి రాజకీయాలు , ఓట్లే తప్ప సంస్థలు , వ్యక్తులు , ప్రజల పట్ల గౌరవంలేదని స్పష్టం అవుతోందని ఆరోపించారు.