సూర్యాపేట : ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశానికి కావాల్సింది ప్రత్యామ్నాయ పార్టీలో, ప్రభుత్వాలో కాదు.. ప్రత్యామ్నాయ ఎజెండా అవసరమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. అందుకోసం యావత్ భారతదేశం ఎదురు చూస్తుందని ఆయన తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి జగదీష్ రెడ్డి చేతుల మీదుగా దివంగత కల్నల్ సంతోష్ బాబు విగ్రహ ఆవిష్కరణ జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఇప్పటి వరకు దేశ అవసరాల కోసం ఏ రాజకీయ పార్టీ కూడా సరైన పునాదులు నిర్మించలేక పోయిందన్నారు. స్వతంత్ర పోరాటం అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గానీ, ఆ తరువాత తామే ప్రత్యామ్నాయం అంటూ ఏర్పడ్డ రాజకీయ పార్టీల సమూహాలు కానీ, ఆ తరువాత కాలంలో గుజరాత్ను చూపించి దేశాన్ని ఉద్దరిస్తామంటూ అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ వరుసగా వైఫల్యం చెందయాయని ఆయన విమర్శించారు. ఈ పార్టీలు ఏవీ కుడా ప్రజల ఆకలి, మౌలిక సదుపాయాలు, సౌకర్యాల కల్పనపై దృష్టి సారించలేకపోయాయని పేర్కొన్నారు.
ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించి లబ్ది పొందాలని బీజేపీ చూస్తోంది. అయితే ప్రతిపక్ష పాత్రను కూడా సరిగా నిర్వహించలేని హీనదుస్థితికి కాంగ్రెస్ పార్టీ చేరుకుందన్నారు. అటువంటి పరిస్థితులనుండి బయట పడేందుకే దేశం ప్రత్యామ్నాయ పార్టీ కోసమో, ప్రభుత్వం కోసమో కాకుండా ప్రత్యామ్నాయ ఎజెండా కోసం ఎదురు చూస్తుందని ఆయన తెలిపారు. అటువంటి ఎజెండా, ఆవశ్యకతను వెల్లడించినందునే ప్రస్తుతం యావత్ భారతదేశం ముఖ్యమంత్రి కేసీఆర్ను స్వాగతిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు.
తెలంగాణా రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా కేవలం ఎనిమిది సంవత్సరాల కాలంలోనే ప్రపంచ చిత్ర పటంలో తెలంగాణాకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిన మహానేత ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన కొనియాడారు. అటువంటి నేత తీసుకున్న నిర్ణయాలతో తెలంగాణా రూపురేఖలు మారి పోయాయన్నారు. ఎటువంటి కొలమానాన్ని పెట్టి చూసినా ఒకటి నుండి 50 వరకు దేశంలో తెలంగాణాయే నెంబర్ వన్ స్థానంలో కనిపిస్తుందని, అందుకే ప్రస్తుతం యావత్ భారతదేశం ముఖ్యమంత్రి కేసీఆర్ వైపు చూస్తుందన్నారు. దేశానికి కావల్సిన ప్రత్యామ్నాయ ఎజెండా ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతుందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎప్పుడూ చరిత్ర నిర్మాతలేనని ఆయన అన్నారు. అటువంటి ప్రజల అభీష్టానికి అనువైన ఎజెండాను ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే ప్రకటిస్తారని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.