నల్లగొండ : గుజరాత్ నమూనా అంటే దేశాన్ని చీకట్లోకి నెట్టడమా? అని మోదీ సర్కార్ పై విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మండిపడ్డారు. గుజరాత్ ప్రభుత్వం వ్యవసాయానికి కేవలం ఆరు గంటల మాత్రమే విద్యుత్ను సరఫరా చేస్తున్నది. పరిశ్రమలకు వారానికి రెండు రోజులు నిర్ద్వంద్వంగా సెలవులు ప్రకటించిందని ఆయన పేర్కొన్నారు.
అలాంటి చీకట్లు అలుముకున్న గుజరాత్ను అభివృద్ధిలో నమూనా అంటే దేశాన్ని చీకట్లోకి నెట్టడమేనంటూ ఆయన ఎద్దేవాచేశారు. బుధవారం మంత్రి మునుగోడు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. మునుగోడు, చండూరు, మర్రిగూడ, నాంపల్లి, మండలాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి,షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొత్త రాష్ట్రం పట్ల బీజేపీ సర్కార్ కక్షపూరితంగా వ్యవరించడం శోచనీయమన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను నిలువరిస్తూ ..లోన్లు అడ్డుకుంటూ కేంద్ర ప్రభుత్వం అభివృద్ధిని అడ్డుకుంటుందని ఆయన ఆరోపించారు.
ఎన్ని కుటిల నీతులు పన్నినా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను కొనసాగిస్తారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్వేత, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, నాంపల్లి రైతుబంధు సమన్వయ సమితి అధ్యక్షుడు ఏడుదొడ్ల రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.