సూర్యాపేట : పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి జిల్లా గ్రంథాలయానికి వస్తున్న యువతకు సొంత ఖర్చులతో భోజనం ఏర్పాటు చేస్తానని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి(Minister Jagadish reddy) ప్రకటించారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని(Library) మంత్రి ఆకస్మికంగా సందర్శించారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతీ యువకులతో ఆయన మాట్లాడారు.
1980 నుంచి 1985 వరకు గ్రంథాలయం లోని స్వీయ అనుభవాలను వారితో పంచుకున్నారు.విద్య ఉపాధి కోసమని ఉద్యోగం కోసం కాకూడదని హితవు పలికారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం పోటీ పడాలని, అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగమే పరమావధి కాకూడదని సూచించారు.
మహిళలు స్వయం ఉపాధి(Self Employment)పై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. అందుకు అవసరమైన ఓరియంటేషన్ శిక్షణకు ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. వేసవి తాపం నుంచి రక్షణగా ఉండేలా కూలర్లు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీచేశారు. జిల్లా కేంద్రంలో ఆధునిక పరిజ్ఞానంతో కూడిన గ్రంథాలయ భవనాన్ని నిర్మించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.