Minister Jagadish Reddy | సూర్యాపేట : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( MLC kavitha ) విషయంలో ఈడీ( ED ) తన పరిధిని మించి ప్రవర్తిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి( Minister Jagadish Reddy ) ధ్వజమెత్తారు. చట్ట ప్రకారం విచారణ జరపడం లేదని మండిపడ్డారు. సూర్యాపేట( Suryapeta )లో మంత్రి జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఎమ్మెల్సీ కవితను రాత్రి వరకు విచారిస్తాం అంటే అది ముమ్మాటికీ వేధించడమే.. రాజకీయ కక్ష సాధింపు చర్యే అని మంత్రి పేర్కొన్నారు. బీజేపీ నాయకుల ఆలోచనలు, వారి ప్రకటనల ఆధారంగానే ఈడీ పని చేస్తుందని ఆరోపించారు. విచారణ సంస్థల పేరుతో బీజేపీ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సిగ్గుచేటని మండిపడ్డారు. రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తూ, రాజకీయ ప్రత్యర్థులను బీజేపీ ప్రభుత్వం వేధిస్తుందని నిప్పులు చెరిగారు. ఒక మహిళను విచారణ చేసే క్రమంలో ఈడీ అధికారులు నిబంధనలు పాటించడం లేదన్నారు. విచారణకు సహకరిస్తానని చెప్పిన తర్వాత కూడా కవితను రాత్రి సమయం వరకు విచారించడం అంటే వేధించడమే అని పేర్కొన్నారు. మహిళల హక్కులను గౌరవించాల్సింది పోయి చట్టంలో ఉన్న లోసుగులను అడ్డంపెట్టుకుని వేధింపులకు పాల్పడుతున్న బీజేపీ దుర్మార్గాలను ప్రజల్లో ఎండగడుతామని చెప్పారు. బీజేపీ నుండి ఈ దేశాన్ని రక్షిస్తాం అని స్పష్టం చేశారు.