– నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వంశీకృష్ణ
నీలగిరి, ఆగస్టు 08 : నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఫుట్ పాత్ లు, రోడ్లు, ప్రజా ప్రదేశాల్లో మటన్, చేపల దుకాణాలు ఏర్పాటు చేసి విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ బి.వంశీ కృష్ణ శనివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఆదివారాల్లో ఫుట్ పాత్లపై మటన్, చేపల విక్రయాలు నిర్వహించడం వల్ల ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగడంతో పాటు మాంసం, చేపల వ్యర్థాలను రోడ్లు, డ్రైన్లలో పడవేయడం వల్ల అపరిశుభ్రత, దుర్వాసన, ప్రజారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయని ప్రజల నుండి ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
అనుమతి/లైసెన్స్ కలిగిన దుకాణ ప్రాంగణాల్లో మాత్రమే మటన్, చేపల విక్రయాలు నిర్వహించాలని, నిబంధనలు ఉల్లంఘించి ఫుట్ పాత్ లపై మటన్ లేదా చేపల విక్రయాలు నిర్వహించినట్లయితే వ్యాపారం నిలిపివేత, ఆక్రమణ తొలగింపు, లైసెన్స్ పై చర్యలు, అవసరమైన సందర్భాల్లో దుకాణం సీజ్ చేయడం, సామగ్రి స్వాధీనం వంటి కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. ప్రజారోగ్యం, పారిశుధ్యం, ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మటన్, చేపల వ్యాపారులు మున్సిపల్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కమిషనర్ కోరారు.