భువనగిరి అర్బన్, ఫిబ్రవరి 12: సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలహీన పర్చాలని, తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తున్న కేంద్రంలోని బీజేపీ కుట్రలను చిత్తు చేయాల్సిన సమయం ఆసన్నమైందని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. భువనగిరి బహిరంగ సభలో మంత్రి ప్రసంగించారు. సీఎం కేసీఆర్ తెలంగాణను ఎంతో అభివృద్ధి చేసి దేశానికే నమూనాగా మార్చారని చెప్పారు. దీంతో కేసీఆర్ను చూసి నేర్చుకోవాలని ఇతర రాష్ర్టాల ప్రజలు అడుగుతారేమోనని ప్రధాని మోదీకి భయం పట్టుకున్నదని ఎద్దేవాచేశారు. పరిపాలన రాదు అని మాట్లాడిన వాళ్లకు నమూనా పాలన అందించి సవాల్ చేస్తున్నారన్నారు. కాళేశ్వరం ద్వారా గోదావరి నీళ్లు తీసుకొచ్చి బస్వాపురం రిజర్వాయర్ నింపి కరువు ప్రాంతాలైన భువనగిరి, ఆలేరు, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో బీడు భూములను సస్యశ్యామలం చేశామని వెల్లడించారు.
విద్యుత్తు మంత్రి మీ జిల్లావారే :సీఎం
మర్లపడి తెలంగాణను ఎలా సాధించుకున్నామో.. అలానే సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకొంటూ వస్తున్నా మని సీఎం కేసీఆర్ అన్నారు. 24 గంటల నాణ్యమైన కరెంటుతో తెలంగాణ వెలుగులు చిమ్ముతున్నదని చెప్పారు. విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి మీ జిల్లాకు చెందిన వారే కావడం మీ అదృష్టమని సీఎం కొనియాడారు.