Minister Jagadish Reddy | రైతాంగం గురించి ఆలోచించేది తెలంగాణ ప్రభుత్వమేనని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం చైర్మన్ బండా నరేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, రవీంద్ర నాయక్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, నోముల భగత్, జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, జడ్పీ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు పంటల సాగును ముందుకు తీసుకువచ్చేందుకు సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని మంత్రి పిలుపునిచ్చారు.
ప్రకృతి వైపరీత్యాల నుంచి రైతాంగాన్ని కాపాడుకునేందుకు సీఎం సంచలన నిర్ణయం తీసుకున్నారన్నారు. మే మాసాంతానికి మొదటి పంట, నవంబర్ చివరికి రెండో పంట నాట్లు పూర్తికి ప్రభుత్వం సంకల్పించిందన్నారు. దాంతో మార్చి చివరి నాటికి ధాన్యం కొనుగోళ్లు పూర్తవుతాయన్నారు. ఈ మేరకు జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టగా.. సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. అనంతరం సభలో పలువురు ప్రజాప్రతినిదులు మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లపై స్పందించగా మంత్రి మాట్లాడుతూ.. తుఫాన్కు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగా అని స్పష్టం చేశారు. ఈ తరహాలో భారతదేశంలో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసిన మరో రాష్ట్రం ఎక్కడా లేదన్నారు. ఈ సందర్భంగా అధికారులను మంత్రి అభినందించారు.
విధానాలను అమలు పరిచే బాధ్యత వరకు శాసనకర్తలకు పరిమితమని, అమలు పరిచే బాధ్యత ఖచ్చితంగా అధికారులపై ఉంటుందన్నారు. అక్కడక్కడా చిన్నచిన్న పొరపాట్లు జరిగితే అధికారుల దృష్టికి తీసుకెళ్లి తగు సూచనలు చేయాలని, రాద్ధాంతం చేస్తే ప్రయోజనం ఏమీ ఉండదన్నారు. యావత్ దేశంలోనే తొలిసారిగా కళ్లాల వద్దే ధాన్యాన్ని కొనుగోలు చేసిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రతీ మీడియా హౌస్కు ఓ ఎజెండా ఉంటుందని, జరుగుతున్న దాన్ని జరగ లేదని చెప్పేందుకు ఆ మీడియా హౌస్లు పోటీపడుతున్నాయని విమర్శించారు. ఇన్నేళ్ల నుంచి రైతాంగం గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్న ఆయన.. ఎవరీ ఎజెండాలను ఉటంకించాల్సిన అవసరం లేదన్నారు. అలాంటి ట్రాప్లో ఏ ఒక్కరూ పడొద్దని ప్రజాప్రతినిధులకు సూచించారు.