Jagadish Reddy | యాదాద్రి భువనగిరి : తెలంగాణ ప్రజల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజలను విభజించే కుట్రలకు బీజేపీ తెరలేపిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు. మెజారిటీ ప్రజలను బీజేపీ రెచ్చగొట్టేది రాజకీయ ప్రయోజనాల కోసమేనని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం యాదాద్రి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఫైళ్ల శేఖర్ రెడ్డి, గ్యాదరి కిశోర్లతో కలసి మంత్రి జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
మధ్య యుగం నాటి సంస్కృతిని తెరమీదకు తెచ్చేందుకు మోదీ,అమిత్ షాల ద్వయం ప్రయత్నం చేస్తుందన్నారు. మేధావులు, కవులు, కళాకారులు, విద్యార్థులు, యువత అప్రమత్తంగా ఉండాలని ఆయన ఉద్బోధించారు. పెట్టుబడిదారుల చేతిలో మోదీ,అమిత్ షాలు కీలు బొమ్మల్లా మారారని ఆయన దుయ్యబట్టారు. దేశ సంపదను కొల్లగొట్టి పెట్టుబడిదారులకు అప్పనంగా కట్టబెడుతున్నారని విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజలు విజ్ఞులని వారి ఆటలు ఇక్కడ సాగవన్నారు. దేశానికి గొప్ప చైతన్యం కలిగించిన తెలంగాణ సాయుధ రైతాంగా పోరాటం జరిగింది ఈ గడ్డ మీదనే అని ఆయన గుర్తుచేశారు. బీజేపీ తమ దుర్మార్గపు రాజకీయాలకు పులిస్టాఫ్ పెట్టకపోతే సాయుధ రైతాంగం లాంటి పోరాటం పునరావృతం అవుతుందని మంత్రి జగదీష్ రెడ్డి హెచ్చరించారు.