సూర్యాపేట: గడిచిన పదేండ్లలో జరిగిన అభివృద్ధిని బేరీజు వేసుకుని మంచి చేస్తున్న బీఆర్ఎస్కు (BRS) అండగా నిలవాలని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish Reddy) అన్నారు. చెప్పినవే కాకుండా చెప్పని పనులను కూడా ఎన్నో చేశామన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేటలోని (Suryapet) సద్దుల చెరువు ట్యాంక్బండ్పై మార్నింగ్ వాకర్స్తో ముచ్చటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సూర్యాపేట అభివృద్ధే తన అభిమతమని.. దేశం అబ్బురపడెలా డెవలప్ చేసేందుకు ఎంత దూరమైనా వెళ్తానన్నారు. 2014కు ముందు, తర్వాత ఎలా ఉందో ప్రజలు ఒకసారి మనస్సుపెట్టి ఆలోచించి చూడాలని కోరారు.
సూర్యాపేట దశదిశలా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా శ్రమిస్తున్నట్లు తెలిపారు. 2014కు ముందు పట్టణవాసులు ఎదుర్కొన్న తాగు, సాగు నీరు, విద్యుత్ సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించానని తెలిపారు. అప్పుడు కంకర తేలిన పట్టణ రహదారులను అద్దంలో మెరిసిపోయేలా చేశానని తెలిపారు.
అండగా ఉండి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపు నిచ్చిన మంత్రి, మూడో దశ పాలనలో రాబోయే డ్రైపోర్టు ద్వారా వేలాది మందికి ఉపాధి లభించడంతో పాటు సూర్యాపేట ఆర్థిక ముఖచిత్రమే మారబోతుందని తెలిపారు. మరోవైపు పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేసి పదివేల మంది యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పిస్తానని తెలిపారు. ఎన్నికల సమయంలో టైగర్లమంటూ ప్రజల్లోకి వస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆదమరిస్తే ముసలి పులి వెనుక ఉన్న తోడేళ్లు పడినట్లే అవుతుందన్నారు.