హైదరాబాద్, ఫిబ్రవరి 3 : రాజ్యాంగం మార్పుపై దేశంలో చర్చ జరగాలన్న సీఎం కేసీఆర్ ప్రకటనతో బీజేపీ, కాంగ్రెస్లో కలవరం మొదలైందని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సీఎం ప్రకటనతో ఏం చేయాలో అర్థంకాక ఆ పార్టీల నేతలు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రకటనను అర్థంచేసుకొనే జ్ఞానం కాంగ్రెస్, బీజేపీ నేతలకు లేకనే అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. మినిస్టర్స్ క్వార్టర్స్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ర్టాల హక్కుల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవడం అభ్యంతరకరమని, ఇలాంటి పరిస్థితుల్లో దేశ ప్రగతి కోసం కొత్త రాజ్యాంగం అనే పదాన్ని కేసీఆర్ తెరపైకి తెచ్చారని తెలిపారు. రాజ్యాంగంపై చర్చించటానికి భయమెందుకని ప్రశ్నించారు.
పునాదులు కదులుతాయని భయం
సీఎం కేసీఆర్ ఆలోచనలు ప్రగతిశీలంగా, దేశాన్ని అభివృద్ధి బాటన పయనింపజేసేలా ఉంటాయని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎప్పుడూ బాధ్యతగా వ్యవహరించలేదని, ఎవరో రాసిస్తేనో, చెప్తేనో మాట్లాడుతారని ఎద్దేవా చేశారు. రాజ్యాంగం పట్ల సీఎం కేసీఆర్ ఆలోచన ఏమిటో ముందుగా తెలుసుకొనే ప్రయత్నం చేయాలని సూచించారు. సీఎం కేసీఆర్ ప్రకటనతో తమ పునాదులు కదులుతాయని కాంగ్రెస్, బీజేపీ నేతలు భయపడుతున్నారని ఎద్దేవాచేశారు. రాజ్యాంగాన్ని ఇప్పటికే అనేకసార్లు సవరించి కొత్త అంశాలను చేర్చి, కొన్నింటిని తొలగించారని గుర్తుచేశారు. ఏ సమాజమైనా ప్రగతిశీలంగా, వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సివిల్ సర్వీసెస్ అధికారులతో పనిచేయించుకోవటం రాష్ర్టాల హక్కు అని, ఈ అంశంలో జోక్యం చేసుకొని ఐఏఎస్, ఐపీఎస్లు ఎక్కడ పనిచేయాలో కేంద్రమే నిర్ణయించాలనుకోవటం దారుణమని విమర్శించారు.
దళారుల బడ్జెట్
కేంద్ర బడ్జెట్ ప్రజలకు ఉపయోగపడేది కాదని జగదీశ్రెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వం కొద్దిమంది దళారులకు ఉపయోగపడే ప్రభుత్వమని విమర్శించారు. సమాజ అంతరాలను పెంచాలని చూస్తున్నదని, బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దేశంలో పేదరికం పెరుగుతున్నదే తప్ప తగ్గడంలేదని పేర్కొన్నారు.