ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లో కేబినేట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం రైతులు పండించిన ధాన్యం మొత్తాన్ని ప్రభుత్వమే కొంటుందని తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని, రైతుల తరుపున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. గత వానకాలం సీజన్ లో కొన్న విధంగానే ఈ యాసంగిలో కూడా ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేస్తామని, కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ లో అన్ని సమస్యలను అధిగమిస్తూ వ్యవసాయాన్ని సుసంపన్నం చేసుకున్నామని పేర్కొన్నారు.
వ్యవసాయాన్ని పండుగల మార్చామని, 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా ద్వారా దిగుబడులు పెరిగాయని గుర్తు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ రెచ్చగొట్టడం వల్లనే అన్నదాతలు వరిని పండించారని ఫైర్ అయ్యారు. ఇలా తెలంగాణ రైతులను బీజేపీ మోసం చేసిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ మోసాన్ని గమనించే ముఖ్యమంత్రి ప్రత్యామ్నాయ పంటలు వేయండి అని అప్రమత్తం చేశారని, కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ రైతులను తప్పుదోవ పట్టించి, అమాయక రైతులను బలిపెట్టారని తీవ్రంగా మండిపడ్డారు.
ధాన్యం కొనుగోళ్లను పర్యవేక్షణ చేయాలి…
గతంలోనే 934 కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోళ్లు చేశామని, ఇప్పుడు కూడా 934 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. దయచేసి మిల్లర్లు, ప్రజాప్రతినిధులు, రైతు బంధు సమితి సభ్యులు అందరూ బాధ్యతగా చిత్తశుద్ధితో పని చేసి , ధాన్యం కొనుగోళ్లను పర్యవేక్షణ చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. అధికార యంత్రాంగం కి సహకరించి ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరపాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ యజ్ఞంలాగా పని చేసి వ్యవసాయాన్ని గాడిన పెట్టారని, కానీ ఇవ్వాళ కేంద్రం కుట్రలు చేసి రైతులకు నష్టం చేయాలని చూస్తోందని మండిపడ్డారు. రైతుల పక్షాన కొట్లాడేది ఎవరో, మోసం చేసేది ఎవరో స్పష్టంగా అర్థం అయిందని, బీజేపీ ముమ్మాటికీ రైతు వ్యతిరేక పార్టీయేనని జగదీశ్ రెడ్డి విమర్శించారు.