హైదరాబాద్: చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రద్దు చేయాలంటూ తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి పోస్ట్ కార్డు రాశారు. రాష్ట్రంలో చేనేత సమస్యలపై మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు చేనేతపై విధిస్తున్న జీఎస్టీ రద్దు చేయాలంటూ పోస్ట్ కార్డు ద్వారా తన నిరసన తెలియజేశారు. చేనేత వస్త్రాలు, ఉత్పత్తులపై ఉన్న 5 శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ భారాన్ని మోపడం సరికాదన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి, ప్రధాని నరేంద్రమోదీకి నేతన్నల ఉసురు తగులుతుందన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా విధంగా చేనేతపై 5% జీఎస్టీ విధింపుతో ఎన్నో దశబ్దాలుగా చేనేతనే నమ్ముకుని స్వయం ఉపాధిపై ఆధారపడ్డ నేతన్నల పరిస్థితి.. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు తయారైందని ఆవేదన వ్యక్తంచేశారు.
చేనేత ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం విధించిన ఐదు శాతం జీఎస్టీని రద్దు చేయాలని కోరుతూ ప్రధాని మోదీకి లక్షలాదిగా పోస్ట్ కార్డులు రాసి నిరసన వ్యక్తంచేయాలని, నేతన్నలకు అండగా నిలబడాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు.