కమాన్చౌరస్తా, ఏప్రిల్ 2: సుమారు 751 మంది కవుల రచనలతో కవితా సంపుటిని ప్రచురించడం ప్రభంజనమని, అది ‘కవితా ప్రభంజన’ పుస్తకానికే దక్కుతుందని అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్లాల్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని అదనపు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం అఖిల భారతీయ సాహిత్య పరిషత్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కవితా ప్రభంజనం పుస్తక పరిచయ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సంగారెడ్డికి చెందిన కవి, అవధాని అవుసుల భానుప్రకాశ్ సంపాదకీయంలో రూపుదిద్దుకున్న గ్రంథం మరొకటి తెలుగు సాహిత్యంలో లేదన్నారు. సంస్కృతాంధ్ర అవధాని తిగుళ్ల శ్రీహరిశర్మ మాట్లాడుతూ, పద్యంతోనే సాహిత్యాన్ని లోతుగా అధ్యయనం చేయడం సాధ్యమవుతుందన్నారు. సాహితీ గౌతమి అధ్యక్షుడు డాక్టర్ గండ్ర లక్ష్మణరావు మాట్లాడుతూ, 2300 పద్యాలతో కూడిన ఇంతటి సంకలనాన్ని తెలుగు సాహిత్యంలో గతంలో చూడలేదని, ఇప్పుడు భానుప్రకాశ్ మన ముందు నిలిపి కొత్త ఒరవడిని సృషించాడని కొనియాడారు.
తెలుగువారి అస్తిత్వానికి తార్కాణంగా నిలిచిన పద్యానికి పూర్వ వైభవం తెచ్చి అపూర్వ సంకలనం తీసుకురావాలనే సంకల్పంతో మెతుకుసీమ సాహితీ సంస్థ ఈ సంకలనాన్ని వెలువరించినట్లు పద్యప్రభంజనం సంపాదకుడు అవుసుల భానుప్రకాశ్ పేర్కొన్నారు. అనంతరం ఉమ్మడి జిల్లాకు చెందిన 62 మంది కవులకు పద్య ప్రభంజనం పుస్తకాన్ని అందజేసి, అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్ చేతుల మీదుగా సన్మానించారు. అఖిల భారతీయ సాహిత్య పరిషత్ జిల్లా అధ్యక్షుడు గాజుల రవీందర్, అధ్యక్షత వహించగా, దాస్యం సేనాధిపతి, కలువకుంట్ల రామకృష్ణ, అన్నాడి గజేందర్ రెడ్డి, రాజారాంమోహన్ శర్మ, నంది శ్రీనివాస్, గంగాధర్, శ్రీకర్, శ్రీనివాస్, రాజమౌళి, మురళీకృష్ణ, కిరణ్, భద్రయ్య, నర్సయ్య, విశ్వనాథ శర్మ, అపర్ణామధు, ఇందిర, ప్రభావతి, అరుణాదేవి, రజిత తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చూడండి..
భిన్నంగా పురుషులు, మహిళల మెదళ్లు.. ఎందుకో తెలుసా..?