హైదరాబాద్: స్వతంత్ర భారత వజ్రోత్సవాలను దేశంలోనే ఇంత ఘనంగా నిర్వహిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా నేడు తెలంగాణకు హరితహారం కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఇవాళ ఒక్కరోజే 75 లక్షల మొక్కలు నాటుతున్నామని చెప్పారు. హైదరాబాద్ బొటానికల్ గార్డెన్లో మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. హరితహారంలో భాగంగా అన్ని పట్టణ ప్రాంతాల్లో అర్బన్ ఫారెస్ట్ పార్కులను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
గతంలో న్యాయవివాదంలో ఉన్న బొటానికల్ గార్డెన్ సమస్యను సీఎం కేసీఆర్ చొరవతో పరిష్కరించుకున్నామని, ఇప్పుడు దానిని దేశంలోనే అద్భుతమైన అర్బన్ ఫారెస్ట్ పార్కుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. బొటానికల్ గార్డెన్ వద్ద విజిటర్స్ కోసం ప్రత్యేకంగా ఫుట్ఓవర్ బ్రిడ్జి, వాకింగ్ సిగ్నల్ ఏర్పాటు చేనున్నామని వెల్లడించారు.