హైదరాబాద్ జనవరి 6 (నమస్తే తెలంగాణ): గిరిజనులు, కూలీలకు ఉపాధి కల్పించే తునికాకు (బీడీ ఆకు) బోనస్ (నెట్ రెవెన్యూ)ను వెంటనే చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ అరణ్య భవన్లో శుక్రవారం కూలీలకు తునికాకు సేకరణకు సంబంధించి పెండింగ్ బోనస్ చెల్లింపులు, ఈ సీజన్లో తునికాకు సేకరణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
రాష్ట్ర పునర్విభజన అనంతరం ఇరు రాష్ట్రాల నెట్ రెవెన్యూ షేర్లను తేల్చడం, కూలీలు వేర్వేరు ప్రాంతాల్లో ఉండటంతో వారి వివరాల సేకరణ వల్ల బోనస్ చెల్లింపుల్లో జాప్యం జరిగిందని అధికారులు తెలిపారు. తునికాకు సేకరించే కూలీల పేర్లు, బ్యాంక్ ఖాతాల వివరాల సేకరణ పూర్తయిందని, దాదాపు రూ.233 కోట్ల బోనస్ను చెల్లించాల్సి ఉందని చెప్పారు. అనంతరం మంత్రి మాట్ల్లాడుతూ.. వీలైనంత త్వరగా కూలీలకు బోనస్ డబ్బులు చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాలని కోరారు. అటవీ సంపదపై వచ్చే ఆదాయం కూడా ఆ ప్రాంత ప్రజలకే చెందాలనే ఉద్దేశంతో రాయల్టీ డబ్బులను కూలీలకు బోనస్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్నదని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, అటవీ శాఖ స్పెష ల్ సీఎస్ శాంతికుమారి, పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియల్, చంద్రశేఖర్ రెడ్డి, వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.