సిద్దిపేట: నాడు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి సాధించుకున్నామని..నేడు తెలంగాణ రైతులకోసం మళ్లీ రోడ్డెక్కామని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. మోడీ సర్కారు తొండాట ఆడుతున్నదని, రైతులను రోడ్డుపైకి తెచ్చిందని విమర్శించారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం వద్ద 10 వేల మందితో నిరసనదీక్ష చేపట్టారు. ఈ దీక్షలో ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, జిల్లా ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ లు, ప్రజాప్రతినిధులతో కలిసి హరీశ్రావు పాల్గొన్నారు.
మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ, తమది గొంతెమ్మ కోరిక కాదని, రైతుల కోసం చేస్తున్న ధర్మపోరాటమని చెప్పారు. నాడు కేంద్రంలోని అన్ని ప్రభుత్వాలు ఎలాంటి ఆంక్షలు లేకుండా వడ్లు కొన్నాయని తెలిపారు. మోడీ సర్కారు ఇప్పుడే ఎందుకు ధాన్యం కొనబోనని మొండికేస్తుందో తెలియడం లేదన్నారు. కేంద్ర సర్కారు లాభనష్టాలు బేరీజు వేసుకుని ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ కంపెనీలాగా పనిచేస్తున్నదని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ.. అచ్చే దిన్ అని చెప్పి సచ్చే దిన్ తీసుకొచ్చారని విమర్శించారు. ప్రజలనుంచి లాక్కోవడమే తప్పా ఇవ్వడం లేదని మండిపడ్డారు.
వడ్లు కొనకుండా రైతులను కాల్చుకు తింటున్న కేంద్ర సర్కారుకు తగిన బుద్ధి చెప్తామని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. మన్ కీ బాత్ కాదు..ముందు తమ రైతుల బాధలు వినాలని మోడీని డిమాండ్ చేశారు. రాజ్యాంగం ప్రకారం.. పండిన వడ్లు కొనే బాధ్యత కేంద్రానిదేనన్నారు. తెలంగాణలో పండిన ప్రతి గింజనూ కొనాల్సిందేనని, వాటిని బాయిల్డ్ చేసుకుంటారా? నూకలు చేసుకుంటారా? సన్నబియ్యంగా మార్చుకుంటారా? అనేది కేంద్రం ఇష్టమని చెప్పారు. వడ్లను విదేశాలకు ఎగుమతి చేయాలన్నా అది కేంద్రమే చేయాలని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.
మోడీ అంటే మోదుడు.. బీజేపీ అంటే బాదుడు!!
పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయని, మోదీ సర్కారు సామాన్యుడి నడ్డి విరుస్తోందని మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. మోడీ అంటే మోదుడు.. బీజేపీ అంటే బాదుడు అని విమర్శించారు. కరెంట్ మీటర్ను మించి పెట్రో ధరలు పెరుగుతున్నాయని చెప్పారు. గత 14 రోజులుగా ప్రతిరోజూ చమురు ధరలు పెరుగుతున్నాయని తెలిపారు. కేంద్ర సర్కారు.. ఎరువుల ధరలు పెంచి రైతుల ఉసురుపోసుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్యాస్ మంటతో మళ్లీ ఉనుక పొయ్యిలు వాపస్ వస్తున్నాయని, మనం ముందుకు పోతున్నమా.. వెనక్కు పోతున్నమా..? తెలియట్లేదన్నారు. మోడీ సర్కారువన్నీ జూటా మాటలేనని విమర్శంచారు. ఎస్టీ లకు 11 శాతం రిజర్వేషన్లు కావాలని తీర్మానం చేసి పంపితే.. పంపలేదని అబద్ధాలు ఆడారని కేంద్ర సర్కారుపై విరుచుకుపడ్డారు. కేంద్రంలో 16,50,000 ఉద్యోగ ఖాళీలుంటే వాటిని నింపకుండా నిరుద్యోగుల ఉసురు పోసుకుంటున్నదని మండిపడ్డారు. ఇది శాశ్వత మైన సమస్య అని, గట్టిగా పోరాడి శాశ్వత పరిష్కారం సాధించుకోవాలని పిలుపునిచ్చారు.