హైదరాబాద్: రాష్ట్రంలో నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) స్క్రీనింగ్ను ఈ నెలాఖరులోగా వంద శాతం పూర్తి చేయాలని అర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆదేశించారు. రోగ నిర్ధారణ అయిన వారికి అవసరమైన మందుల కిట్లు వెంటనే అందజేయాలని సూచించారు. నెలవారీ సమీక్షలో భాగంగా మంత్రి హరీశ్రావు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఆశాలు, ఏఎన్ఎంలతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వైద్యరంగాన్ని బలోపేతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలను సీఎం కేసీఆర్ తీసుకుంటున్నారని తెలిపారు. క్షేత్ర స్థాయిలో ఉంటూ ఆరోగ్య సేవలందించే ఆశాలు, ఏఎన్ఎంలు నూతనోత్సాహంతో పని చేయాలని కోరారు.
వానాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని మంత్రి హరీశ్రావు సూచించారు. అన్ని రకాల మందులను ప్రభుత్వం సరఫరా చేస్తున్నదని, మందులు లేవనే మాటే రావొద్దన్నారు. ఈ- ఔషధి ద్వారానే అన్ని రకాల మందుల పంపిణీ జరుగాలని సూచించారు. గర్బిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, పీహెచ్సీలు, ప్రభుత్వ దవాఖానల్లో డెలివరీలు పెరుగాలని, ముఖ్యంగా సాధారణ ప్రసవాలు ప్రోత్సహించాలని ఆదేశించారు. పుట్టిన బిడ్డకు గంటలోపే తల్లి పాలు అందేలా చూడాలన్నారు. గర్భిణులను ప్రభుత్వ దవాఖానలకు తీసుకొస్తున్న ఆశాల కోసం ప్రత్యేక గది, కనీస సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు జిల్లాల పర్యటన చేయాలని, డీఎంహెచ్వోలు, డిప్యూటీ డీఎంహెచ్వోలు, ప్రోగ్రాం ఆఫీసర్లు ఎక్కువగా ఫీల్డ్ విజిట్స్ చేయాలని మంత్రి హరీశ్రావు ఆదేశించారు. పనిచేసే సిబ్బందికి తగిన గుర్తింపు ఉంటుందని, నిర్లక్ష్యం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, డీఎంఈ రమేశ్రెడ్డి, టీవీవీపీ కమిషనర్ అజయ్కుమార్, డీహెచ్ శ్రీనివాస్రావు, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్రెడ్డి, ఎన్హెచ్ఎం సీపీవో మాధవి, అన్ని జిల్లాల డీఎంహెచ్వోలు, డిప్యూటీ డీఎంహెచ్వోలు, పీవోలు, మెడికల్ ఆఫీసర్లు, తదిరులు పాల్గొన్నారు.