పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు తెలంగాణ సమగ్రాభివృద్ధికి నాంది పలికాయని, వీటితో పల్లెలు, పట్టణాల స్వరూపం మారిపోయిందని మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో ఐదో విడత పల్లె ప్రగతి, నాలుగో విడత పట్టణ ప్రగతి కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంపై మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్కే భవన్లో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, ఇతర అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 3 నుంచి 15 రోజుల పాటు కార్యక్రమం ప్రారంభమవుతున్న నేపథ్యంలో గతంలో చేపట్టిన, తాజాగా చేపట్టబోయే కార్యక్రమాలపై చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడారు. పల్లెలు, పట్టణాల అభివృద్ధి కోసం దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 6, 2019 నుంచి అక్టోబర్ 5 వరకు తొలిసారిగా ఈ కార్యక్రమం ప్రారంభించిందన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, పారిశుధ్య పనులు చేసుకోవడంతోపాటు గ్రామానికి ఒక ట్రాక్టర్ ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు పల్లెల అభివృద్ధి కోసం రూ. 8,963 కోట్లు, పట్టణ ప్రగతి కోసం రూ. 2,748 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. మొత్తంగా రూ. 11,711 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ రూ. 514.3 కోట్లు చెల్లింపులు చేసినట్లు వివరించారు.
ప్రస్తుతం వివిధ దశల్లో చెల్లింపుల కోసం ఉన్న సుమారు రూ. 285 కోట్లను రాబోయే రెండు, మూడు రోజుల్లో చెల్లించాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పథకం కింద ఎలాంటి బకాయిలు లేకుండా పూర్తి చెల్లింపులు చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేస్తూ, సమగ్ర ప్రణాళికతో అమలు చేస్తున్న ఈ కార్యక్రమం మంచి ఫలితాలను రాబట్టిందన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజనాలో 20 ఉత్తమ గ్రామాలు ఎంపిక చేస్తే, అందులో 19 తెలంగాణకు చెందినవి ఉండడం దీనికి నిదర్శనం అని పేర్కొన్నారు. హరితహారం, పల్లె ప్రకృతి వనాల వల్ల రాష్ట్రంలో గ్రీన్ కవర్ 7.7శాతం పెరిగిందని, ఆకుపచ్చ తెలంగాణ దిశగా తెలంగాణ సాగుతుందన్నారు.
కేంద్రం నుంచి నయా పైసా రాలేదు!
ఉపాధి హామి పథకం కింద చేపట్టిన పనులకుగానూ సుమారు రూ. 1100 కోట్లు కేంద్రం ఇవ్వాల్సి ఉందని, ఆ నిధులను వెంటనే విడుదల చేయాలని మే మొదటి వారంలోనే కేంద్రానికి లేఖ రాసినట్లు మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పారు. ఆర్థిక సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు పూర్తి కావొస్తున్నప్పటికీ కేంద్రం ఉపాధి హామీ కింద నయా పైసా విడుదల చేయలేదన్నారు. దీంతో చేసిన పనులకు బిల్లులు రాక వివిధ గ్రామాల సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. మరోసారి కేంద్రానికి లేఖ రాయడంతోపాటు ఢిల్లీ వెళ్లి సంబంధిత అధికారులతో మాట్లాడాలని, నిధులు విడుదల చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియాను ఆదేశించారు. కేంద్రం నిధులు విడుదల చేసిన వెంటనే త్వరితగతిన చెల్లింపులు చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
15వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన రూ. 1,013 కోట్లు ఇవ్వలేదని, అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పల్లెలు, పట్టణాల అభివృద్దికి గత ఆర్థిక సంవత్సరంలో రూ. 4,619 కోట్లను ఖర్చు చేసినట్లు చెప్పారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వచ్చేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. గతంలో పూర్తి చేసిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల స్ఫూర్తితో స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేసుకొని ఈ విడత కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని, ఆ దిశగా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రులు ఆదేశించారు.