సంగారెడ్డి : సంగారెడ్డి పట్టణ కేంద్రంలో రూ.50 కోట్ల నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులకు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు శంకుస్థాపన చేశారు. బీసీ బాలికల కాలేజీ హాస్టల్ భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. సైన్స్ మ్యూజియాన్ని సందర్శించారు. సంగారెడ్డి మున్సిపల్ కాంప్లెక్స్ను, చింతలపల్లిలో బస్తీ దవఖానాను ప్రారంభించారు. రూ. 15 కోట్లతో నిర్మించిన రెండు వాటర్ ట్యాంక్లను కూడా మంత్రి హరీశ్రావు ప్రారంభించి, ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. జిల్లాకు వచ్చిన స్పేస్ ఆన్ వీల్స్ బస్సును మంత్రి సందర్శించి, ఇస్రో శాస్త్రవేత్తలతో పలు అంశాలపై చర్చించారు.
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన అనంతరం మంత్రి హరీశ్రావు ప్రసంగించారు. సంగారెడ్డి పట్టణంలో రూ. 50 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడం సంతోషంగా ఉందన్నారు. సంగారెడ్డి పట్టణ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా రూ. 50 కోట్ల నిధులు కేటాయించారని తెలిపారు. టెండర్లు పిలిచి త్వరగా పనులు మొదలు పెట్టాలని సూచించారు.
రూ. 15 కోట్లతో తాగునీరు కోసం 4 వాటర్ ట్యాంక్లు నిర్మించి ఇంటింటీకి తాగునీరు ఇచ్చే పథకం ప్రారంభం చేశామని తెలిపారు. ఇక సంగారెడ్డి మున్సిపాలిటీలో తాగునీటి సమస్య ఉండదన్నారు. రూ. 500 కోట్లతో 650 పడకల సామర్థ్యంతో మెడికల్ కాలేజీ నిర్మాణం జరుగుతుందన్నారు. త్వరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజ్ ప్రారంభం జరుగుతుందన్నారు. సంగారెడ్డిలో కొత్తగా మరిన్ని బస్తీ దవఖానాలు ప్రారంభిస్తామని మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు.