ముదిగొండ, ఆగస్టు 6: శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని రాహుల్, రేవంత్రెడ్డి, భట్టి నిరుద్యోగులకు సమాధానం చెప్పాలని ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కార్ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం గ్రామానికి చెందిన గడ్డం వేణుకుమార్ను.. బీఆర్ఎస్ శ్రేణులతో వెళ్లి ఆయన నివాసంలో గురువారం పరామర్శించారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పంపించిన రూ.లక్ష ఆర్థిక సాయాన్ని కమల్ రాజు.. వేణుకు అందజేశారు. ఈ సందర్భంగా కమల్ రాజు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగం రాదేమోనని మదనపడుతూ మరో మార్గం లేక సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకోవాలని వేణు యత్నించాడని గుర్తు చేశారు.
వేణుకు ఇది పునర్జన్మ అని, వైద్యులు ఎంతో శ్రమించి వేణును కాపాడారని తెలిపారు. వేణు రాసిన సూసైడ్ నోట్ కేటీఆర్ చెప్పినట్లుగా సూసైడ్ నోట్ కాదని, అది రాష్ట్ర ప్రభుత్వం మీద ఛార్జ్షీట్ అని, అందుకే ప్రభుత్వాన్ని కదిలించిందన్నారు. నియోజకవర్గంలో ఇంత జరుగుతున్నా డిప్యూటీ సీఎంకు తీరిక లేదని, ఒక నిరుద్యోగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడితే ధైర్యం చెప్పి ఆదుకోవాల్సిన బాధ్యత మీకు లేదా అని ప్రశ్నించారు. రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరుద్యోగులకు తప్పకుండా న్యాయం జరుగుతుందన్నారు. ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు ఉండడం వల్ల ఎంపీ రవిచంద్ర రాలేకపోయారని, మీరు వెళ్లి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పాలని పంపించారని చెప్పారన్నారు. బీఆర్ఎస్ నాయకులు వాచేపల్లి లక్ష్మారెడ్డి, గడ్డం వెంకటేశ్వర్లు సలీమున్నీసా బేగం, ఖాసీంబాబు, సిల్వరాజు, పచ్చా సీతారామయ్య, ఏలూరి రమేశ్, కొమ్మూరి రమేశ్, నర్సింహారావు, శ్రీను, కోటేష్ తదితరులు పాల్గొన్నారు.
‘ఆత్మహత్యకు పాల్పడిన నేను అసలు బతుకుతానని అనుకోలేదని వేణుకుమార్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని పదే పదే చెబితే నాకు ఏదో ఒక ఉద్యోగం రాకపోతుందా అని భావించానని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటినా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని, మూడో సంవత్సరం వస్తున్నా జ్యాబ్ క్యాలెండర్ ఊసే లేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ఏదైనా మాట్లాడితే బెదిరిస్తున్నారని ఆరోపించారు. నాకు ఇందిరమ్మ ఇల్లు రాలేదని అడిగితే మా గ్రామంలోని ఓ నాయకుడు ‘నీకు ఇల్లు రాదు.. రానివ్వను’ అని అన్నాడని, ఇంతకంటే అన్యాయం ఉంటుందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ నాకు ఎంతో అండగా నిలిచిందని, కేటీఆర్ సార్ కూడా నాతో మాట్లాడి ధైర్యం చెప్పారని, అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నానని పేర్కొన్నారు.