హైదరాబాద్ : రాష్ట్రంలో రైతుబంధు సంబురం మొదలైంది. తెలంగాణ వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదు జమ అవుతోంది. నగదు జమ అయిన వెంటనే రైతుల ఫోన్లకు మేసేజ్లు రావడంతో.. అవి మోగిపోతున్నాయి. ఆ మేసేజ్లను చూసి రైతులు మురిసిపోతున్నారు. ఇక ఆ నగదును డ్రా చేసుకునేందుకు బ్యాంకుల వద్దకు రైతులు వెళ్తున్నారు. అలా ప్రతి ఊరులో పండుగ వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తున్నారు.. ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు రైతులు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు ట్వీట్ చేశారు. రాష్ట్రంలో రైతు బంధు సంబురం మొదలైందని తన ట్వీట్లో పేర్కొన్నారు. తొలి రోజున ఒక ఎకరం వరకు భూమి కలిగిన 19,98,285 మంది రైతుల ఖాతాల్లో రూ. 586.66 కోట్ల నగదు జమ చేసినట్లు తెలిపారు. ఇవి అంకెలు కావు. రైతు సంక్షేమం పట్ల కేసీఆర్ అంకితభావానికి సిసలైన ఆనవాళ్లు అని ఆయన పేర్కొన్నారు. మొత్తం 68.10 లక్షల రైతులకు రూ. 7,521 కోట్లు పెట్టుబడి సాయంగా అందించనుందని మంత్రి హరీశ్రావు తెలిపారు.
కేంద్రం అనేక ఆర్ధిక ఇబ్బందులు సృష్టిస్తున్నా అన్నదాతలకు ఏ లోటు రానివ్వద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రైతుబంధు కింద పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ దృఢ సంకల్పానికి యావత్ రైతులోకం జేజేలు పలుకుతున్నదని హరీశ్రావు పేర్కొన్నారు. తొలకరి రైతుకు ప్రకృతి ఇచ్చిన వరం.. రైతుబంధు అన్నదాతకు ప్రభుత్వం అందిస్తున్న వరం..
ఇది రైతు ప్రభుత్వం.. రైతు బిడ్డ పరిపాలిస్తున్న ప్రభుత్వం అని హరీశ్రావు కొనియాడారు.
కేంద్రం అనేక ఆర్ధిక ఇబ్బందులు సృష్టిస్తున్నా అన్నదాతలకు ఏ లోటు రానివ్వద్దనే సీఎం కేసీఆర్ గారి దృఢ సంకల్పానికి యావత్ రైతులోకం జేజేలు పలుకుతున్నది.
తొలకరి రైతుకు ప్రకృతి ఇచ్చిన వరం.
రైతుబంధు అన్నదాతకు ప్రభుత్వం అందిస్తున్న వరం
ఇది రైతు ప్రభుత్వం..రైతు బిడ్డ పరిపాలిస్తున్న ప్రభుత్వం— Harish Rao Thanneeru (@trsharish) June 28, 2022