హైదరాబాద్ : పేదరిక నిర్మూలనలో కీలక పాత్ర పోషిస్తున్న సెర్ప్ ఉద్యోగుల(Serp employees) సేవలు అమోఘమని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖా మంత్రి హరీశ్రావు (Minister Harish rao)అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో సెర్ప్ (Serp) ఉద్యోగుల రాష్ట్ర స్థాయి కృతజ్ఞత సభ శనివారం జరగింది.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఉద్యోగుల చేత వెట్టిచాకిరి చేయించుకుందని ఆరోపించారు. ఉద్యోగుల కలను నిజం చేసిన ఘనత సీఎం కేసీఆర్(CM KCR) కే దక్కుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పీఆర్సీ(PRC) ఇస్తున్నారని వెల్లడించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ.30 వేల కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇవ్వలేదని,మెడికల్ కాలేజీలు ఇవ్వలేదని మండిపడ్డారు.
ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను ప్రజలకు స్పష్టంగా వివరించాలని సూచించారు.మూడో సారి ముఖ్యమంత్రి గా కేసీఆర్ ను చేసే వరకు పట్టుపట్టాలని కోరారు. మహిళా సంఘాల పనితీరుకు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశంసిస్తుందని అన్నారు. తెలంగాణకు ముందు, తరువాత ఉన్న పరిస్థితులను ప్రజలకు వివరించాలని తెలిపారు. విద్యుత్, సాగు, తాగునీరు, సదుపాయాలు , పింఛన్ల గురించి తెలియజేయాలని వెల్లడించారు.
ప్రతిపక్షాల కంటే వేగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచిస్తారని తెలిపారు. ప్రతిపక్షాలకు చెప్పడానికి ఏమీ లేక తిట్ల దండకం తప్ప మరోటి లేదన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, అధికారులు, రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చిన సెర్ప్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సెర్ప్ ఉద్యోగులకు వేతనాలు పెంచడం పట్ల సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.