తెలంగాణ సాధన సమయంలో కేసీఆర్ ఉద్యమ జ్వాల. తెలంగాణ సీఎంగా ఇప్పుడు ఆయన అభివృద్ధి జ్వాల. బీ అంటే బీదలు, ఆర్ అంటే రైతులు, ఎస్ అంటే సామాన్యుల కోసం పనిచేసే పార్టీయే బీఆర్ఎస్ పార్టీ.
– హరీశ్రావు
సంగారెడ్డి, మార్చి 27 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టే కుట్రలు పన్నుతున్నదని, వాటిని తిప్పికొడతామని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. తెలంగాణలో మళ్లీ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కేసీఆర్ నాయకత్వంలో హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్లో సోమవారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని, పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 90 నుంచి 100 సీట్లు రా వడం ఖాయమని, సీఎం కేసీఆర్ వద్ద ఉన్న పలు సర్వేల్లో ఇదే స్పష్టమైందని చెప్పారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాయని ఎద్దేవా చేశారు. రెండు పార్టీలను ప్రజలు విశ్వసించడం లేదని పేర్కొన్నారు.
కేంద్ర సర్కారు రాష్ర్టానికి రావాల్సిన నిధులను పూర్తిగా నిలిపివేసిందని మంత్రి హరీశ్రావు వెల్లడించారు. నీతి ఆయోగ్ సిఫార్సు చేసిన రూ.24 వేల కోట్లు, విద్యుత్ సంస్కరణలు అమలు చేయడం లేదని రూ.30 వేల కోట్లు, ఎఫ్ఆర్బీఎంకు సంబంధించి రూ.15 వేల కోట్లు.. ఇలా పెద్ద మొత్తంలో నిధులను నిలిపివేసిందని వివరించారు. బీఆర్ఎస్ సర్కారును విఫల ప్రభుత్వంగా చూపాలని బీజేపీ ప్లాన్ వేసిందని, కానీ సీఎం కేసీఆర్ దూరదృష్టి, నాయకత్వ పటిమతో కేంద్రం కుట్రను తిప్పికొట్టారని చెప్పారు. బీఆర్ఎస్ను ఎదుర్కోలేక కేసీఆర్ ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు బీజేపీ రెండో కుట్రకు తెరలేపిందని, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కూలదోయాలని ప్రయత్నించిందని తెలిపారు.
సీఎం కేసీఆర్ దానిని కూడా తెలివితో తిప్పికొట్టారని చెప్పారు. తమ కుట్రలన్నీ విఫలం కావడంతో బీజేపీ తాజాగా ఈడీ, సీబీఐ, ఇన్కంట్యాక్స్ దాడులకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. ఈడీ దాడుల ద్వారా బీఆర్ఎస్ నాయకులను భయబ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ఎలాంటి తప్పులు చేయలేదని, కేంద్రం కుట్రలను తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు 8 ఏండ్లలో పేదలకోసం ఏ ఒక్క మంచిపథకం కూడా తీసుకురాలేదని విమర్శించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, బీఆర్ఎస్ నాయకులు పట్నం మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.