Telangana Budget | 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ఆర్థిక మంత్రి హరీశ్రావు శాసనసభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. హరీశ్రావు బడ్జెట్ ప్రసంగం 1 గంట 44 నిమిషాల పాటు కొనసాగింది. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైన బడ్జెట్ ప్రసంగం.. మధ్యాహ్నం 12:14 గంటల వరకు కొనసాగింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఎనిమిదిన్నరేండ్ల స్వల్పకాలంలోనే అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకున్నది. ప్రజాసంక్షేమంలోనూ అభివృద్ధిలోనూ యావత్ దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచింది. తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అని చెప్పుకునే స్థాయికి చేరుకున్నది. ఇది రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణం. మానవీయమైన దృక్పథం, నిర్మాణాత్మకమైన ఆలోచన, దార్శనికమైన ప్రణాళికా రచన, పారదర్శకమైన పరిపాలన వీటన్నిటి మేలు కలయిక అయిన “తెలంగాణ మోడల్” నేడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు పొందుతున్నదని తెలుపుతూ హరీశ్రావు తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు.
రానున్న రోజుల్లోనూ జాతి నిర్మాణంలో తెలంగాణ మరింత ఉజ్వల పాత్రను నిర్వహించే విధంగా పురోగమిస్తుంది.. దళితులు, గిరిజనులు, మైనార్టీలు, బడుగు, బలహీన వర్గాల ప్రజలు, అగ్రవర్ణ పేదలు అందరి జీవితాల్లో సంపూర్ణమైన వికాసాన్ని సాధించేంత వరకు విశ్రాంతి, విరామం ఎరుగక పరిశ్రమిస్తూనే ఉందాం.. ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే ఉందాం. ఇందుకోసం రాజీలేని మార్గాన్ని అనుసరిస్తామని, ఈ మహా సంకల్పానికి సంపూర్ణమైన అండదండలు అందించాలని తెలంగాణ ప్రజానీకాన్ని సవినయంగా కోరుతున్నాను అని మంత్రి హరీశ్రావు తన బడ్జెట్ ప్రసంగాన్ని ముగించారు. చివరగా జై తెలంగాణ.. జై హింద్ అని నినదించారు.