ఉమ్మడి రాష్ట్రంలో కాగితాలకే పరిమితమైన మనోహరాబాద్- కొత్తపల్లి రైలు మార్గం.. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవ, మంత్రి హరీశ్రావు నిరంతర పర్యవేక్షణతో కార్యరూపం దాల్చగా.. నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. సిద్దిపేట జిల్లాలో 65 కిలోమీటర్లకు పైగా పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం సిద్దిపేట శివారులో రైల్వేస్టేషన్ నిర్మాణం, ఐదు ట్రాక్ లైన్ల పనులు జరుగుతున్నాయి. ఇక్కడే గూడ్స్ షెడ్ నిర్మించనున్నారు. ఈ నెలాఖరులోగా సిద్దిపేట స్టేషన్ వరకు రైలు నడిచేలా యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతున్నారు.
సిద్దిపేట, ఆగస్టు 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టువదలని కృషి, ఆర్థిక మంత్రి హరీశ్రావు నిరంతర పర్యవేక్షణతో త్వరలోనే సిద్దిపేటకు చుక్చుక్ రైలు రానున్నది. మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి కరీంనగర్ జిల్లా కొత్తపల్లి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ నూతన రైల్వేలైన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి సిద్దిపేట జిల్లా గజ్వేల్ మీదుగా దుద్దెడ వరకు రైల్వే సేఫ్టీ అధికారులు క్లియరెన్స్ ఇచ్చారు. దీంతో సిద్దిపేట జిల్లా రంగధాంపల్లి శివారు వరకు రైలు వచ్చింది. సిద్దిపేట జిల్లాలో 83.40 కిలోమీటర్ల రైల్వేలైన్ నిర్మాణానికిగానూ ఇప్పటి వరకు 65 కిలోమీటర్లకు పైగా పూర్తి చేశారు. త్వరలోనే దుద్దెడ నుంచి సిద్దిపేట వరకు రైల్వేసేఫ్టీ అధికారులు రైల్వేట్రాక్ను పరిశీలించి క్లియరెన్స్ ఇవ్వనున్నట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ నెలాఖరు నాటికి సిద్దిపేటలో రైలు కూత వినిపించనున్నది.
చకచకా సిద్దిపేట రైల్వేస్టేషన్ పనులు
సిద్దిపేట శివారులోని నర్సాపూర్, కేసీఆర్నగర్ కాలనీ సమీపంలో సిద్దిపేట రైల్వేస్టేషన్ను నిర్మిస్తున్నారు. ఇక్కడ ట్రాక్ నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇటీవల సిద్దిపేట-హనుమకొండ రహదారి రంగధాంపల్లి శివారు వరకు రైల్వే సామగ్రి తీసుకొచ్చే రైలు వచ్చింది. అక్కడి నుంచి సిద్దిపేట రైల్వేస్టేషన్ వరకు రైలు వచ్చేలా ప్రస్తుతం పనులు చేస్తున్నారు. రైల్వేస్టేషన్ పరిధిలో సీసీ, ర్యాక్, మెట్లు, కార్యాలయం, తదితర పనులతోపాటు ఐదు వరుసల ట్రాక్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ ఐదు ట్రాక్ లైన్లలో 1, 2, 3 లైన్లను ప్యాసింజర్ రైళ్లు, 4వ లైన్ను గూడ్స్ రైళ్లు, 5వ లైన్ను ప్యాకింగ్, మరమ్మతులు, ఇంజిన్ల సైడింగ్ కోసం వినియోగించనున్నారు. ఇక్కడే గూడ్స్ షెడ్ను నిర్మిస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి రైలు సిద్దిపేట రైల్వేస్ట్టేషన్ వరకు వచ్చేలా యుద్ధ ప్రాతిపదికన పనులు నిర్వహిస్తున్నారు. మనోహరాబాద్-కొత్తపల్లి మార్గంలో తొలిదశలో మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి నాచారం, బేగంపేట, అప్పాయిపల్లి, గజ్వేల్, కొడకండ్ల, లకుడారం, దుద్దెడ వరకు రైల్ నడపడానికి రైల్వే సేఫ్టీ అధికారులు క్లియరెన్స్ ఇచ్చారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి మనోహరాబాద్ మీదుగా గజ్వేల్ వరకు రైలు సేవలు ప్రారంభమయ్యాయి. గజ్వేల్లో రైల్వే రేక్ పాయింట్ ఏర్పాటుతో ఎరువులు దిగుమతి చేసుకుని పలు జిల్లాలకు సరఫరా చేస్తున్నారు. దీంతో ఎరువులు తీసుకురావడానికి సనత్నగర్ రేక్ పాయింట్కు వెళ్లాల్సిన శ్రమ తగ్గింది. త్వరలోనే సిద్దిపేట నుంచి కాచిగూడ రైల్వేస్టేషన్ వరకు రెగ్యులర్ రైలు రానుంది. దీంతోపాటు తిరుపతి, బెంగళూరు తదితర దూర ప్రాంతాలకు ఇక్కడి నుంచి రైలు నడిపేలా అధికారులు ప్రణాళికలు సిద్ధ్దం చేస్తున్నట్టు సమాచారం
151.36 కిలోమీటర్లనిర్మాణం
సికింద్రాబాద్-మన్మాడ్ వెళ్లే మార్గంలో మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి రైల్వేలైన్ ప్రారంభమై సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట మీదుగా రాజన్న సిరిసిల్లలోని సిరిసిల్ల, వేములవాడ, బోయినపల్లి, అక్కడి నుంచి కరీంనగర్ జిల్లాలోని వెదిర మీదుగా పెద్దపల్లి-నిజమాబాద్ వెళ్లే మార్గంలో కొత్తపల్లి వద్ద ఈ లైన్ కలుస్తుంది. ఈ రైల్వేలైన్ పొడవు 151.36 కిలోమీటర్లు. రూ.1160.47 కోట్ల అంచనాతో పనులను ప్రతిపాదించారు. ఈ రైల్వేలైన్ నిర్మాణానికి సుమారుగా 2,200 ఎకరాల భూమి అవసరం ఉండగా, సిద్దిపేట జిల్లాలో పూర్తి స్థాయిలో భూసేకరణ పూర్తి చేసి రైల్వేశాఖకు అప్పగించారు. నాలుగైదు దశల్లో పనులు చేపట్టేలా అధికారులు ప్రణాళికలు సిద్ధ్దం చేసి ఆ దిశగానే పనులు ముమ్మరం చేశారు. ఈ రైల్వేలైన్ నిర్మాణం మెదక్ జిల్లాలో 9.30 కి.మీ., సిద్దిపేట జిల్లాలో 83.40 కి.మీ., రాజన్నసిరిసిల్ల జిల్లాలో 37.80 కిలోమీటర్లు, కరీంనగర్ జిల్లాలో 20.86 కిలోమీటర్లు, మొత్తం 151.36 కిలోమీటర్ల రైల్వేలైన్ నిర్మాణం చేస్తారు. నాలుగు జిల్లాల్లో మొత్తం 15 రైల్వే స్టేషన్లు నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు. భవిష్యత్తులో ఈ లైన్ ఉత్తరాది, దక్షిణాదిని కలిపే ముఖ్యమైన రైల్వే మార్గం కానున్నది. ఫలితంగా ఢిల్లీ, కోల్కతా తదితర మహానగరాలకు లింక్ ఏర్పడుతుంది. మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు నిర్మించే ఈ రైల్వే మార్గాన్ని 2025 నాటికి పూర్తి చేయాలని గడువు పెట్టుకున్నారు.