హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): నీళ్లు, నిధులు, నియామకాలు.. ఇది తెలంగాణ ఉద్యమ నినాదం. స్వరాష్ట్ర లక్ష్యాల సాధనకు టీఆర్ఎస్ సర్కారు అహరహం శ్రమించింది. ఒక్కో అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టి క్రమంగా సాకారం చేసింది. ప్రణాళికలు రచించి తెలంగాణను దేశంలో అగ్రస్థానంలో నిలిపింది. ఇవన్నీ తెలియని పొలిటికల్ టూరిస్ట్ అమిత్ షా శనివారం తెలంగాణ పర్యటనలో అబద్ధాలు వల్లె వేశారు. తాము అధికారంలోకి వస్తే తెలంగాణ ట్యాగ్లైన్ నిధులు, నీళ్లు, నియామకాలను పూర్తి చేస్తామని మరోమారు విషం వెళ్లగక్కారు.
సాగునీటి రంగమే రాష్ట్ర ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత. మిషన్ కాకతీయ పథకం ద్వారా 27,651 చెరువును సర్కారు ఆధునీకరించింది. ఫలితంగా చిన్న నీటి వనరుల స్టోరేజీ సామర్థ్యం 8 టీఎంసీలు పెరిగాయి. 15.15 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 1,250 చెక్డ్యాంలను నిర్మించింది. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణను సస్యశ్యామలం అయ్యింది. సీతారామ ఎత్తిపోతల వేగంగా సాగుతున్నది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులూ కొనసాగుతున్నాయి. మిషన్ భగీరథ ద్వారా 54 లక్షల ఇండ్లకు సురక్షిత తాగునీరు అందుతున్నది. భూగర్భజల మట్టం 4.32 మీటర్ల మేర పెరిగింది. 1.25 కోట్ల ఎకరాలకు సాగునీరందుతున్నది. అమిత్ షా.. ‘నీళ్లు’ సాకారం అంటే ఇది.
ఉమ్మడి రాష్ట్రంలో నిధులన్నీ ఆంధ్రా ప్రాంతానికే తరలిపోయేవి. ఇప్పుడు తెలంగాణ ఆర్థికంగా మహోజ్వలంగా వెలుగొందుతున్నది. దేశాన్ని సాదుతున్న ఐదారు రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటి. రాష్ట్ర జీఎస్డీపీ రూ.5.5 లక్షల కోట్ల నుంచి రూ.11 లక్షల కోట్లకు పెరిగింది. తలసరి ఆదాయం రూ.1.35 లక్షల నుంచి రూ.2.80 లక్షలకు పెరిగింది. జాతీయ సగటు తలసరి ఆదాయం తెలంగాణ కన్నా చాలా తక్కువగా ఉన్నది. రాష్ర్టానికి వచ్చిన ప్రతి పైసాను ప్రజల సంక్షేమానికే ప్రభుత్వం వినియోగిస్తున్నది. తెలంగాణ నుంచి ఎనిమిదేండ్లలో రూ.3.36 లక్షల కోట్లు ఇస్తే.. మాకు కేంద్రం అందులో సగం కూడా ఇవ్వలేదనేది వాస్తవం కాదా అమిత్ షా? ఇది.. ‘నిధులు’ సాకారం అంటే.
గత ఎనిమిదేండ్లలో పలు ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో 1.33 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. వీటిలో 30 వేల పైచిలుకు ఉద్యోగాలు టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీచేయగా, పలు ప్రభుత్వ శాఖలు, రిక్రూట్మెంట్ ఏజెన్సీల ద్వారా లక్షకు పైగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది. ఒక్క టీఎస్పీఎస్సీ ద్వారానే 148 నోటిఫికేషన్లు జారీచేసి, 32 వేల పైచిలుకు ఉద్యోగాలను నింపింది. తాజాగా 91,142 పోస్టుల భర్తీకి ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో ఇప్పటికే ఆర్థిక శాఖ 30 వేల పైచిలుకు పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపగా.. పోలీసు, ఎక్సైజ్, రవాణాశాఖల్లో 17,291 పోస్టులు, 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ‘నియామకాలు’ సాకారం అవుతున్నాయిలా. అయినా.. నియామకాల హామీ నెరవేర్చలేదంటావా అమిత్ షా? ఉద్యమ నినాదాలను నెరవేర్చిన ఘనత టీఆర్ఎస్ సొంతం. కేసీఆర్ సొంతం. ఇప్పుడొచ్చి తాము నెరవేర్చుతామనటం విడ్డూరం కాక మరేమిటి?