హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం 2016లో చేసిన పెద్ద నోట్ల రద్దు ఓ పనికిమాలిన చర్య అని, దీనిపై ప్రధాని మోదీ దేశానికి క్షమాపణ చెప్పాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. నోట్లరద్దు అట్టర్ ఫ్లాప్ అని కేంద్ర ప్రభుత్వమే లోక్ సభలో ఒప్పుకొన్నదన్నారు. మంగళవారం ఆయన ఎమ్మెల్సీలు దండే విఠల్, దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, కృష్ణమోహన్రెడ్డి, చిరుమర్తి లింగయ్యతో కలిసి బీఆర్ఎస్ఎల్పీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ ‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి.. జరిగేది ఇంకొకటి’ అని ఎద్దేవా చేశారు. ‘బీజేపీ చెప్పేవి వింటే ప్రజలకు భ్రమలు కలుగుతాయి.. చేసే చర్యలతో కష్టాలు కలుగుతాయి.. జరిగిన తర్వాత నష్టాలే మిగులుతాయి’ అని విమర్శించారు. దీనికి పెద్ద నోట్ల రద్దే ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు. కేంద్ర సర్కారు ఉరుము లేని పిడుగులా పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించిందని మండిపడ్డారు. ఆ తర్వాత పరిణామాలు దేశ ప్రజలతోపాటు ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపాయని తెలిపారు. చారాణా ఉంటే బారాణా ప్రచారం చేసుకొనే బీజేపీ నేతలు పెద్ద నోట్ల రద్దుపై ఎందుకు మాట్లాడటం లేదని హరీశ్రావు ప్రశ్నించారు. ‘ప్రధాని సహా నేతలందరి మౌనమే నోట్ల రద్దు అట్టర్ఫ్లాప్ అనేందుకు నిదర్శనమని పేర్కొన్నారు.
ప్రాణాలు బలి.. పోపుల డబ్బా ఖాళీ!
పెద్ద నోట్లరద్దు వల్ల ప్రజల ప్రాణాలు పోవడం, కంపెనీలు మూతపడి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దెబ్బతినడం తప్ప ఎలాంటి ప్రయోజనం కలుగలేదని మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ఇంట్లో ఉండే మహిళలు అత్యవసర సమయంలో ఖర్చు పెట్టుకొనేందుకు పోపుల డబ్బాల్లో దాచిపెట్టుకొన్న డబ్బు కూడా మాయమైందని పేర్కొన్నారు. ‘నోట్ల రద్దుతో రూ.లక్షల కోట్లు బ్యాంకుల్లోకి రాదు. ఆర్బీఐ నుంచి డివిడెండ్ తీసుకొని పేదల ఖాతాల్లో వేస్తాం. జన్ధన్ ఖాతాలు తెరవండి.. ధన్ ధన్ డబ్బులు వేస్తాం’ అని ప్రజలను మభ్యపెట్టారని మండిపడ్డారు. నోట్ల రద్దు నాటికి దేశంలో చలామణిలో ఉన్న నగదు విలువ రూ.15.44 లక్షల కోట్లు అని, రూ.15.31 లక్షల కోట్లు తిరిగి బ్యాంకులకు వచ్చిందని వివరించారు. 99.3 శాతం డబ్బు తిరిగి వచ్చిందని, మరి నల్లధనం ఎకడ బయటపడిందని ప్రశ్నించారు.
ముసుగులు తొలుగుతున్నాయ్
బీజేపీ ప్రతి అడుగు.. పేదలపై పిడుగుగా మారిందని మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. బీజేపీ ఇన్నాళ్లుగా కల్పిస్తున్న భ్రమలు పటాపంచలు అవుతున్నాయని, ముసుగులు తొలుగుతున్నాయని చెప్పారు. 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని జోక్గా మార్చారని మండిపడ్డారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి, ధరలు పెంచి ఖర్చు డబుల్ చేశారని ఫైర్ ఆయ్యారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో 50 రోజుల్లో అద్భుతాలు చేస్తామని, లేకుంటే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని ప్రధాని మోదీ చెప్పారని గుర్తు చేశారు. ‘50 రోజులు కాదు 2వేల రోజులు అయింది.. నోట్ల రద్దుతో కలిగిన ఒక ఉపయోగమైనా చెప్పగలరా.?’ అని మోదీని నిలదీశారు. ‘నల్ల చట్టాలపై రైతులు దేశవ్యాప్తంగా ఉద్యమిస్తే మీరు క్షమాపణ చెప్పారు. మరి పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలు నష్టపోయారు.. కష్టపడ్డారు.. పరిశ్రమలు మూతపడి దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది.. దీనికి మీరిచ్చే సమాధానం ఏమిటి?’అని కేంద్ర సర్కారును నిలదీశారు.
అప్పులు చేయడం.. తప్పులు చేయడం తప్ప బీజేపీకి ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు. తొమ్మిదేండ్లలో రూ.107 లక్షల కోట్లు అప్పు చేశారని మండిపడ్డారు. రోజూ రూ.4,618 కోట్లు, నెలకు రూ.లక్ష కోట్ల చొప్పున దేశ ప్రజలపై అప్పులు మోపుతున్నారని పేర్కొన్నారు. నీతి ఆయోగ్ను నేతి బీరకాయలో నెయ్యి చందంగా విలువ లేకుండా చేశారని విమర్శించారు. పెద్ద నోట్లరద్దు, అర్ధరాత్రి లాక్డౌన్తో కేంద్ర సర్కారు వేలాది మందిని పొట్టనబెట్టుకొన్నదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాల్లో కోడిగుడ్డు మీద ఈకలు పీకే కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నేతలు.. పెద్దనోట్ల రద్దు విషయంలో దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశాన్ని పాలించడంలో బీజేపీ అన్ని రంగాల్లో విఫలమైందని.. మత పిచ్చిని రేపడంలో మాత్రం కాస్త సక్సెస్ అయ్యిందని ఎద్దేవా చేశారు. కానీ ప్రజలు అందరికంటే తెలివైన వారని, అన్నీ ఆలోచిస్తున్నారని తెలిపారు. మనకన్నా చిన్న దేశాలు ముందుకు వెళ్తుంటే మనం ఎందుకు తిరోగమనంలో ఉన్నామో ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. ‘బీజేపీ కో హఠావో.. దేశ్కో బచావో’ అని మంత్రి హరీశ్రావు ప్రజలకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఇచ్చిన సమాధానంలో పెద్దనోట్ల రద్దు వెనుక మూడు లక్ష్యాలు ఉన్నట్టు చెప్పిందని మంత్రి హరీశ్రావు గుర్తు చేశారు. ఇందులో ఒక్కటి కూడా నెరవేరలేదని, పైగా పరిస్థితి పూర్తి భిన్నంగా మారిందని పేర్కొన్నారు. మూడు లక్ష్యాలు, వాస్తవ పరిస్థితులను ఆయన వివరించారు.
లక్ష్యం-1: దేశంలో పెద్ద ఎత్తున పెరుగుతున్న నకిలీ నోట్ల నియంత్రణ.
వాస్తవం: ఆర్బీఐ 2021-22 రిపోర్ట్ ప్రకారం 2022 మార్చి నాటికి చలామణిలో ఉన్న రూ.500 నకిలీ నోట్ల సంఖ్య 1,80,933. నకిలీ రూ.2000 కరెన్సీ నోట్ల సంఖ్య 78,298. దేశంలో నకిలీ కరెన్సీ 54 శాతం పెరిగింది. దీనిని బట్టి పెద్దనోట్ల రద్దు తర్వాత నకిలీ నోట్ల చలామణి విపరీతంగా పెరిగింది.
లక్ష్యం నంబర్-1.. అట్టర్ ఫ్లాప్
లక్ష్యం – 2: పెద్ద నోట్లను పెద్ద ఎత్తున నిల్వ చేస్తున్నారు. అవినీతి పెరుగుతున్నది. నగదు చలామణిని తగ్గిస్తాం.
వాస్తవం: కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపిన లెకల ప్రకారం 2014కు ముందు దేశంలో రూ.13 లక్షల కోట్ల విలువైన నగదు చలామణిలో ఉండేది. 2022 మార్చి నాటికి రూ.31 లక్షల కోట్లకు పెరిగాయి. అంటే డబుల్ అయ్యింది. బీజేపీ రాకముందు దేశ జీడీపీలో 11 శాతం నగదు చలామణిలో ఉంటే.. ఇప్పుడు 13.7 శాతానికి పెరిగింది. 2014 నాటికి చలామణిలో ఉన్న పెద్ద నోట్ల సంఖ్య 7,73,300. డీమానిటైజేషన్ తర్వాత 2022 మార్చినాటికి దేశంలో చలామణిలో ఉన్న పెద్ద నోట్లు 13,05,326. దీనిని బట్టి పెద్దనోట్ల సంఖ్య తగ్గలేదు కదా పెరిగింది. రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేసి రూ.2వేల నోట్లు తెచ్చారు. మరి రద్దు చేసింది పెద్ద నోట్లా? చిన్న నోట్లా?. రూ.2 వేల నోట్లు తేవడం వల్ల నగదు చలామణిని నియంత్రించాలన్న లక్ష్యం నెరవేరలేదు. పైగా అవినీతి పెరిగింది. తాము 592 కేసుల్లో రూ.40 వేల కోట్ల నల్లధనం పట్టుకొన్నామని కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం (సీబీడీటీ) చెప్పింది. అంటే.. వ్యక్తుల దగ్గర పెద్ద నోట్ల రూపంలో నల్లధనం పోగవకుండా చూస్తామన్న లక్ష్యం కూడా అట్టర్ ఫ్లాప్.
లక్ష్యం-3: నకిలీ నోట్ల రూపంలో డ్రగ్, ట్రాఫికింగ్, ఉగ్రవాదులకు నిధులు అందకుండా చూస్తాం.
వాస్తవం: ఈ లక్ష్యం నెరవేరలేదని ఎవరిని అడిగినా చెప్తారు. రూ.వేల కోట్ల విలువైన డ్రగ్స్ అదానీ పోర్టుల్లో దొరుకుతున్నాయి. పుల్వామా వంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అంటే మూడో లక్ష్యం కూడా అట్టర్ ఫ్లాప్.