అమిత్షా నోరుతెరిస్తే అబద్ధాలే. తుక్కుగూడ సభలో మాట్లాడిన మాటలు వింటే.. ఆయనకు అల్జీమర్స్ వ్యాధి ఉన్నదేమోనన్న అనుమానం కలుగుతున్నది. కండ్లముందు కనిపిస్తున్న వాస్తవాలను విస్మరించి, పదే పదే అబద్ధాలు మాట్లాడటం విస్మయం కలిగిస్తున్నది. పార్లమెంటు సాక్షిగా కేంద్రమంత్రులే తెలంగాణను ప్రశంసించిన ఉదంతాలను మరిచిన అమిత్షా..మతిమరుపు వ్యాధితో బాధపడుతున్నట్టు సందేహించాల్సి వస్తున్నది. రాష్ర్టానికి రావాల్సిన పైసలు ఇవ్వకుండా.. తెలంగాణకు నీళ్లు, నిధులు ఇస్తామని, నియామకాలు చేపడుతామని చెప్పడం భరించలేని కామెడీ.
–మంత్రి హరీశ్రావు
తూప్రాన్/మనోహరాబాద్, మే 15 : బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అబద్ధాలకు అడ్డా అయితే.. హోంమంత్రి అమిత్షా అబద్ధాలకు బాద్షా అని నిరూపించుకున్నాడని రాష్ట్ర ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు విమర్శించారు. ఆదివారం మెదక్ జిల్లా తూప్రాన్లో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు హాజరైన మంత్రి స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియాలో, వాట్సాప్ యూనివర్సిటీలో అబద్ధాలను ప్రచారం చేయాలని చెప్పే పార్టీ బీజేపీ మాత్రమేనని హరీశ్రావు అన్నారు. అబద్ధాలను ప్రచారంచేయాలని అమిత్షా గతంలో కార్యకర్తలకు చెప్పడాన్ని ఆయన ఉదహరించారు. ‘దేశంలో ఇంత సులువుగా అబద్ధాలు ఆడే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన అమిత్షా మాత్రమే. ఆయన హైదరాబాద్కు వచ్చి మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే. ప్రజలను తప్పుదోవపట్టించేందుకు ఆయన శతవిధాలా ప్రయత్నించారు’ అని హరీశ్రావు పేర్కొన్నారు. అమిత్షా మాటల్ని నమ్మేందుకు ఇది గుజరాత్ కాదని, అమాయకపు తెలంగాణ అంతకంటే కాదని అన్నారు. పోరాటాల గడ్డమీద గోల్మాల్ మాటలు చెల్లవని చెప్పారు. తుక్కుగూడ సభలో అమిత్షా నోటి వెంట కనీసం ‘జై తెలంగాణ’ అనే మాట కూడా రాలేదని హరీశ్రావు గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు శ్రద్ధాంజలి ఘటించింది కానీ, తెలంగాణ అమరులకు బీజేపీ ఎందుకు నివాళులు అర్పించలేకపోయిందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర విభజన చట్టాన్ని అమలు చేయాల్సిన కేంద్ర హోంశాఖ మంత్రి.. దాని గురించే మాట్లాడలేదని చెప్పారు.
మా ప్రాజెక్టులకు జాతీయహోదా ఏది?
తెలంగాణపై వివక్ష ప్రదర్శించే బీజేపీ జాతీయ నేతలకు.. నీళ్లు నిధులు, నియామకాల గురించి మాట్లాడే అర్హత లేదని హరీశ్రావు స్పష్టంచేశారు. ‘మేం అధికారంలోకి వస్తే నీళ్లు, నిధులు ఇస్తామని, నియామకాలు చేపడుతామని అమిత్షా చెప్పడం పెద్ద జోకు. భరించలేని కామెడీ. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అన్ని ప్రాంతాలకు నీళ్లు తెచ్చింది. దీనిపై చర్చకు సిద్ధం. రాష్ట్రంలో ఎక్కడికి పోదామో చెప్పండి. వరంగల్ వెళ్దామా? మహబూబాబాద్, భూపాలపల్లి, సిద్దిపేట.. ఏ జిల్లాకైనా పోయి చూద్దాం. నీళ్లొచ్చాయో లేదో జనం చెబుతారు కదా’ అని ఆయన పేర్కొన్నారు. బీజేపీకి తెలంగాణ నీళ్లపై ప్రేమ ఉంటే ఇక్కడి ప్రాజెక్టులకు ఎందుకు జాతీయ హోదా ఇవ్వలేదని ప్రశ్నించారు. ‘కేంద్రంలో ఎనిమిదేండ్లుగా అధికారంలో ఉన్నా పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు? కృష్ణా జలాల్లో వాటా తేల్చాలని ఎన్నిసార్లు విన్నవించినా.. కనీసం పట్టించుకోలేదు ఎందుకు? ఆంధ్రప్రదేశ్లో పోలవరానికి, కర్ణాటకలో అప్పర్ భద్రకు జాతీయహోదా ఇచ్చిండ్రు. అమిత్ షా.. మీకు తెలంగాణపై ప్రేమ ఉంటే మా ప్రాజెక్టులకూ జాతీయ హోదా ఇవ్వాలి’ అని హరీశ్రావు డిమాండ్ చేశారు.
రాష్ర్టానికి రావాల్సిన నిధులు ఇచ్చి మాట్లాడండి..
కేంద్రం నుంచి నిధులిచ్చామని అమిత్షా పదే పదే చెబుతున్నాడని, కానీ అవి రాష్ర్టానికి హక్కుగా వచ్చే డబ్బులేనని, అందులో బీజేపీ ప్రభుత్వం కొత్తగా ఇచ్చిందేమీ లేదని హరీశ్రావు స్పష్టంచేశారు. రాష్ట్రం కడుతున్న పన్నుల నుంచే తిరిగి కేంద్రం నిధులు ఇస్తున్నదని చెప్పారు. తెలంగాణకు కేంద్రం నుంచి హక్కుగా రావాల్సిన రూ.7,183 కోట్ల నిధులను ఆపింది బీజేపీ ప్రభుత్వమేనని ఆయన దుయ్యబట్టారు. 13వ ఆర్థిక సంఘం నుంచి రూ.1,129 కోట్లు, 14వ ఆర్థిక సంఘం నుంచి రూ.817 కోట్లు, 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.1,103 కోట్లు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కింద, రాష్ట్ర విభజన చట్టం కింద రూ.1,350 కోట్లు రాష్ర్టానికి రావాలన్నారు. జీఎస్టీ పరిహారం రూ. 2, 245 కోట్లు, సీఎస్ఎస్లో తప్పుగా ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన రూ.454 కోట్లు కలిపి మొత్తం రూ.7,183 కోట్ల నిధులను కేంద్రం ఆపిందని ఆయన వివరించారు. అమిత్షాకు చిత్తశుద్ధి ఉంటే ముందు పైసలు ఇచ్చి మాట్లాడాలని అన్నారు.
కొలువులను ఊడగొట్టడమేనా నియామకాలంటే..?
బీజేపీ కూడా నియామకాల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉన్నదని హరీశ్రావు అన్నారు. ఏటా రెండుకోట్ల ఉద్యోగాలిస్తామని బీజేపీ 2014 మ్యానిఫెస్టోలో ప్రకటించిందని, మరి ఏడున్నరేండ్లలో 15కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగాల కల్పనపై కేంద్రం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా, ఉన్న కొలువులను ఊడగొట్టిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదేనని చెప్పారు. దేశంలో 15లక్షల 62వేల ఉద్యోగాలు భర్తీచేయకుండా కేంద్రం ఖాళీగా ఉంచిందని ఆయన తెలిపారు. బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీని అమ్మకానికి పెట్టి వేలాదిమంది ఉద్యోగుల జీవితాలను బజారున పడేశారని విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షా 50వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే, లక్షా 35వేల ఉద్యోగాలను ఇప్పటికే భర్తీ చేశామని హరీశ్రావు వివరించారు. తెలంగాణ పిల్లలు ఉద్యోగాల సాధనలో బిజీగా ఉన్నారని, ఉచిత కోచింగ్ సెంటర్లు పెట్టించి సీఎం కేసీఆర్ వారికి శిక్షణ ఇప్పిస్తున్నారని చెప్పారు.
గుజరాత్కు పనికిరాని ఫసల్ బీమా మాకెందుకు?
ఫసల్ బీమా యోజన పథకాన్ని కార్పొరేట్ కుంభకోణంగా పేర్కొంటూ బీజేపీ పాలిత రాష్ట్రమైన గుజరాతే పక్కనబెట్టిందని హరీశ్రావు తెలిపారు. అలాంటి పథకాన్ని తెలంగాణలో అమలు చేయాలని అమిత్షా అనడం విడ్డూరంగా ఉందన్నారు. ఫసల్బీమా పథకం ద్వారా రైతుకు చేరింది రూ.1800 కోట్లు అని, కంపెనీలకు ముట్టింది మాత్రం రూ.2,415 కోట్లు అని ఆయన వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు లాభం చేస్తున్నదని, కంపెనీలకు కాదని చెప్పారు. రైతుబంధు పథకం ద్వారా 14,400 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమచేస్తున్నామని మంత్రి వివరించారు.
మచ్చుకు మూడు అబద్ధాలు
అబద్ధం-1 :
ఆయుష్మాన్ భారత్ తెలంగాణలో అమలు కావడం లేదని అమిత్షా మరో పచ్చి అబద్ధం మాట్లాడారు. ఆ పథకం తెలంగాణలో అమలవుతున్నదని 2022 ఫిబ్రవరి 4న పార్లమెంట్ సాక్షిగా.. కేంద్రమంత్రి విశ్వేశ్వర్ తుడు ప్రకటించారు. ఆయుష్మాన్ భారత్ అమల్లోకి వచ్చిన తర్వాత తెలంగాణలో రూ.850 కోట్లు ఖర్చు చేసి, 3 లక్షల 62 వేల మందికి చికిత్స చేశాం.
అబద్ధం-2 :
తెలంగాణ ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ దవాఖానలను ఏర్పాటు చేయాలని అమిత్షా మాట్లాడుతున్నారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్ నలుమూలలా నాలుగు సూపర్ స్పెషాలిటీ దవాఖానలు పెట్టాలని నిర్ణయించి, రూ.2600 కోట్లతో నిర్మించనున్న మూడు దవాఖానలకు నిన్నగాక మొన్న శంకుస్థాపన చేసిన విషయం మరిచిపోతే ఎలా? కేంద్రం ఏదీ ఇవ్వకపోయినా 33 జిల్లాల్లో 33 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.
అబద్ధం-3 :
మన ఊరు-మనబడి కార్యక్రమం అంతా సర్వశిక్షా అభియాన్లో నిధులతో చేస్తున్నామని అమిత్షా మరో అబద్ధం చెప్పారు. ఈ పథకం కోసం రాష్ట్రప్రభుత్వం రూ.7,300 కోట్లు ఖర్చు చేస్తుండగా, సర్వశిక్షా అభియాన్ ద్వారా కేంద్రం ఇస్తున్నది రూ.300 కోట్లు మాత్రమే. ఇదే నిజం. తుక్కుగూడ సభలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలంగాణకు రూ.30వేల కోట్లు కేంద్రం నిధులిచ్చింది అంటడు. అరగంట తర్వాత మాట్లాడిన అమిత్షా రూ.18వేల కోట్లు ఇచ్చామంటడు. వాళ్లకే క్లారిటీ లేదు. ఏ కేంద్రమంత్రి మాటలు నమ్మాలె..?