హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన సచివాలయాన్ని (Secretariat) ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రారంభించారు. ఆరో అంతస్తులోని సీఎం కార్యాలయానికి వెళ్లిన ముఖ్యమంత్రి సుముహూర్త సమయంలో కుర్చీలో ఆసీనులయ్యారు. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్దీకరణ సహా ఆరు ఫైళ్లపై సంతకాలు చేశారు. అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.
తర్వాత మంత్రులు తమ చాంబర్లలో ఆసీనులయ్యారు. సంబంధిత ఫైళ్లపై తొలి సంతకాలు చేశారు. మంత్రి కేటీఆర్.. పేదల ఆత్మగౌరవ ప్రతీక అయిన డబుల్ బెడ్రూం ఇళ్లకు సంబంధించిన ఫైలుపై సంతకం చేయగా మంత్రి హరీశ్ రావు రెండు దస్త్రాలపై సంతకం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తన చాంబర్లో ప్రత్యేక పూజలు చేశారు.
నూతన సచివాలయంలో ఒకటో అంతస్తులోని తన ఛాంబర్లో ఆసీనులైన మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో పని చేస్తున్న 19,800 మంది ఉపాధ్యాయులకు రూ.34.25 కోట్లతో ట్యాబ్లను, 5 వేల ప్రాథమిక పాఠశాలల్లో లైబ్రరీ కార్నర్లను రూ. 7.53 కోట్లతో ఏర్పాటు చేసే దస్త్రాలపై తొలి సంతకం చేశారు.
ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన ఫైల్పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తొలి సంతకం చేశారు.
పౌరసరఫరాల శాఖలో ఐసీడీఎస్ అంగన్వాడీలకు పోషకాల సన్నబియ్యం పంపిణీ ఫైలుపై, బీసీ, ఎంబీసీ కార్పోరేషన్ల ఆక్షన్ ప్లాన్ ఫైల్పై మంత్రి గంగుల కమలాకర్ తొలిసంతకం చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నాలుగు జిల్లాలోని 100 ఆలయాలకు ధూప దీప నైవేద్య పథకం వర్తింపజేస్తు ఫైల్ పై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తొలి సంతకం చేశారు. భక్తుల ఆరోగ్యాని దృష్టిలో పెట్టుకొని ప్రధాన దేవాలయాల్లో మిల్లెట్ ప్రసాదాన్ని అందుబాటులోకి తెచ్చే దస్త్రంపై ఆయన సంతకం చేశారు.
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తన ఛాంబర్లో ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా పలు దస్త్రాలపై ప్రశాంత్ రెడ్డి సంతకాలు చేశారు. అనంతరం శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆశీర్వాదం తీసుకున్నారు ప్రశాంత్ రెడ్డి. అంతకు ముందు తన ఛాంబర్లో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ప్రశాంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత మంత్రి హరీశ్రావు తన ఛాంబర్లో ఆసీనులయ్యారు. రెండో అంతస్తులోని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ ఛాంబర్లో హరీశ్రావు ఆసీనులై.. పలు దస్త్రాలపై సంతకాలు చేశారు.