మెదక్, మే 27 (నమస్తే తెలంగాణ) /మనోహరాబాద్: మతాల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని, కాంగ్రెస్ది అసమర్ధ నాయకత్వమని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు విమర్శించారు. మెదక్ జిల్లా కేంద్రంలో రూ.17 కోట్లతో నిర్మించిన మాతా, శిశు సంరక్షణ కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. మెదక్ నియోజకవర్గంలో ఎంపికైన 100 మంది దళితబంధు లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేశారు. మనోహరాబాద్ మండలం రామాయపల్లి, కోనాయపల్లిలో డబుల్ బెడ్రూం(కేసీఆర్ నగర్) కాలనీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. తమ హయాంలో నీళ్లు, ఎరువులు ఇవ్వలేని కాంగ్రెస్ నేతలు నేడు రైతు డిక్లరేషన్ అని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్లో పూర్తిగా వడ్లు ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అంటేనే కాలిపోయే మోటర్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, ఎరువుల కోసం పోలీస్స్టేషన్ల వద్ద లైన్లు యాదికొస్తున్నాయని చెప్పారు. ఓటుబ్యాంకు కోసం కాంగ్రెస్, బీజేపీ నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను చూసి కేంద్రం ఓర్వడం లేదని, తెలంగాణపై బీజేపీకి ఈర్ష్యగా ఉన్నదని దుయ్యబట్టారు. రాష్ర్టానికి వచ్చిన ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షా పేదల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం ఒక్కమాట చెప్పలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ సంక్షేమ పాలన అందిస్తుంటే, మోదీ సర్కారు ప్రజలపై ధరల భారం మోపుతున్నదని ధ్వజమెత్తారు. ‘ఇయ్యాల ఓ తాన జాగ కొనాలంటే లక్షలు పెట్టాలే.. అసొంటిది జాగతో పాటు లక్షలు ఖర్చుపెట్టి, అర్హులైన నిరుపేదలకు సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లను అందిస్తున్నార’ని వివరించారు.
ప్రతి నెలా 3న ‘ఆశ’లతో మాట్లాడతా
ప్రతి నెలా 3న రాష్ట్రంలో ఉన్న ఆశ వర్కర్లతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతానని హరీశ్రావు చెప్పారు. ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేయాలని ఆశ వర్కర్లకు సూచించారు. ప్రభుత్వ దవాఖానల్లో కాన్పులు, సాధారణ కాన్పులు పెరిగితే సంబంధిత డాక్టర్లు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలకు ప్రోత్సాహకం ఇచ్చే ఆలోచన ఉన్నదని వెల్లడించారు. కొన్ని ప్రైవేట్ దవాఖానలు గర్భిణులను కాన్పు కోసం తమ వద్దకు పంపిస్తే కమీషన్ ఇస్తామని ఆశ పెడుతాయని, అలాంటి వాటి జోలికి పోవద్దని సూచించారు.
దళితబంధు ఒక ఉద్యమం
దళితబంధు ఒక పథకం కాదని, ఇది ఒక ఉద్యమమని, దళిత సంరక్షణ నిధిని కూడా ఏర్పాటు చేస్తున్నామని హరీశ్రావు పేర్కొన్నారు. దేశంలోనే మొదటిసారి వివిధ ప్రభుత్వ కాంట్రాక్ట్లు, లైసెన్స్ల్లో 16 శాతం రిజర్వేషన్లు దళితులకు అమలుచేస్తున్నట్టు తెలిపారు. అన్ని రంగాల్లో దళితులు ఎదగాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, జడ్పీ చైర్మన్ హేమలతా శేఖర్గౌడ్, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, జిల్లా కలెక్టర్ హరీశ్, అదనపు కలెక్టర్లు రమేశ్, ప్రతిమాసింగ్ పాల్గొన్నారు.