Railway Recruitment : కేంద్ర ప్రభుత్వ, రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రైల్వే శాఖ గుడ్న్యూస్ అందించింది. రైల్వే శాఖలో 4 వేలకుపైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. జూనియర్ ఇంజనీర్ (జేఈ) సహా 4,098 పోస్టులకు ద రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (ఆర్ఆర్బీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
దీని ద్వారా జూనియర్ ఇంజనీర్ (జేఈ), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (డీఎంఎస్), కెమికల్ అండ్ మెటల్లర్జికల్ అసిస్టెంట్ (సీఎంఏ) పోస్టులను భర్తీ చేయనుంది. ఇందుకోసం సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటిస్ (సీఈఎన్) నెం.04/2026 ప్రకటించింది. ఉద్యోగాల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ వచ్చే ఆగష్టు 14న ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 13, 2026 వరకు రీజియన్ల వారీగా దరఖాస్తులు చేసుకోవచ్చు. తెలంగాణ వారు ఆర్ఆర్బి సైట్కు సంబంధించి సికింద్రాబాద్ రీజియన్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర ప్రాంతాల వారు కూడా రీజియన్ల ప్రకారం అప్లికేషన్లు సమర్పించాలి.
మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా లేదా బ్యాచిలర్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్న వారు ఈ పోస్టులకు అర్హులు. నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు, ఇతర మినహాయింపులు వర్తిస్తాయి. విద్యార్హతలు, ఖాళీల వివరాలు, వయసు పరిమితి, వేతనం వంటి పూర్తి వివరాల కోసం ఆర్ఆర్బి సైట్ను సందర్శించండి.