రంగారెడ్డి: ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఏ కార్యక్రమం చేసినా దానివెనక మానవీయ కోణం ఉంటుందని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. బ్రేక్ఫాస్ట్ (CM Breakfast) కార్యక్రమం పేద పిల్లలకు వరమని చెప్పారు. దేశంలో ఇలాంటి అల్పాహార పథకం ఎక్కడాలేదన్నారు. ఇంగ్లిష్ మీడియంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందన్నారు. వెయ్యి గురుకులాలు ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఆడపిల్ల చదువుకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని చెప్పారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాల జడ్పీ ఉన్నత పాఠశాలలో సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా 20 లక్షల మంది విద్యార్థులకు లబ్ధిచేకూరుతుందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల తరుపున సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఉండే పిల్లలకు పౌష్ఠికాహారం అందిస్తున్నామని మంత్రి చెప్పారు. దేశంలో విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ అందించే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని, ఇది విద్యావ్యవస్థలో సమూల మార్పుతెస్తుందన్నారు.
సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న అన్ని పథకాలు సూపర్ హిట్ అని, ఒక పథకం అమలుచేసే ముందు ప్రజాకోణంలో ఆలోచిస్తారని చెప్పారు. అందుకే అవి విజయవంతం అవుతున్నాయని, సామాజిక మార్పునకు కారణమవుతున్నాయని తెలిపారు. కళ్యాణ లక్ష్మి రూ.లక్ష ఇచ్చే పథకం మాత్రమే కాదని, అది బాల్య వివాహాలను తగ్గించిందని చెప్పారు. చట్టాలతో సాధ్యంకానిది ఒక పథకం చేసిందన్నారు. కేసీఅర్ కిట్ 16 వస్తువులు ఇచ్చే పథకం మాత్రమే కాదు.. వంద శాతం ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు జరుగుతున్నాయని వెల్లడించారు. మిషన్ భగీరథతో సురక్షిత తాగునీరు అందుతున్నదని, తద్వారా సీజనల్ వ్యాధులు తగ్గుముఖం పట్టాయన్నారు. ఇప్పుడు సీఎం బ్రేక్ఫాస్ట్ కేవలం విద్యార్థుల కడుపు నింపే కార్యక్రమం మాత్రమే కాదని.. స్కూల్స్లో డ్రాప్ ఔట్స్ తగ్గించి, బడి బాట పట్టించి, విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పు తెచ్చే పథకమని చెప్పారు. 9, 10 తరగతుల విద్యార్థులకు దేశంలో మనం మాత్రమే భోజనం అందిస్తున్నామని పేర్కొన్నారు. దసరా తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా బ్రేక్ ఫాస్ట్ పథకం అమలు అవుతుందని మంత్రి హరీశ్ తెలిపారు.
మానవీయ కోణంలో..
మానవీయ కోణంలో పేద విద్యార్థులకు ప్రవేశపెట్టిందే సీఎం బ్రేక్ఫాస్ట్ పథకమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం అందిస్తున్నామని వెల్లడించారు. విద్యాశాఖపై ప్రత్యేక శ్రద్ధవహిస్తున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.