Telangana | కరీంనగర్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని( Womens Day ) పురస్కరించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) తెలంగాణ అక్కాచెళ్లెళ్లకు మూడు కానుకలను అందించారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు( Minister Harish Rao ) తెలిపారు. ఒకటి ఆరోగ్య మహిళ( Arogya Mahila ), రెండోది న్యూట్రిషన్ కిట్స్(Nutrition Kits ), మూడోది రూ. 750 కోట్ల వడ్డీ లేని రుణాలు( Vaddi Leni Runalu ) అని మంత్రి స్పష్టం చేశారు. కరీంనగర్ వేదికగా ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం, పట్టణంలోని మార్క్ఫెడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి హరీశ్ రావు ప్రసంగించారు.
మహిళలు ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. వాటికి పరిష్కారంగా ఆరోగ్య మహిళ ప్రారంభించాం అని మంత్రి తెలిపారు. క్యాన్సర్, రక్త హీనత, గర్బసంచి, అధిక బరువు, పోషకాహార లోపం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఆర్థిక పరమైన ఇబ్బందులు, అవగాహన లేక, సమస్య ఉన్నా ఇతరులకు చెప్పలేక మీకు మీరే బాధపడుతుంటారు. ఈ క్రమంలో మహిళల సమస్యలను పరిష్కరించేందుకే ఆరోగ్య మహిళ ప్రారంభించామని తెలిపారు. 8 రకాల ఆరోగ్య సమస్యలకు ఆరోగ్య మహిళ ద్వారా పరిష్కారం లభిస్తుందన్నారు. పరీక్షలు చేస్తారు, మందులు, వైద్యం అందిస్తారు. వ్యాధి తీవ్రత బట్టి అవసరం మేరకు, ప్రభుత్వ పెద్దాసుపత్రికి రిఫర్ చేస్తారు. రిఫరల్ ఆసుపత్రుల్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తాం, అక్కడ కూడా ప్రత్యేకంగా మద్దతు అందించి చికిత్స అందిస్తారని హరీశ్రావు తెలిపారు. ప్రతి మంగళవారం పూర్తిగా మహిళా వైద్య సిబ్బంది ఉండి వైద్యం అందిస్తారు. ప్రస్తుతం 100 ఆసుపత్రులు ప్రారంభిస్తున్నాం. రాబోయే రోజుల్లో 1200 సెంటర్లకు పెంచుతాం అని మంత్రి ప్రకటించారు. మహిళలందరూ ఆరోగ్య మహిళా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని హరీశ్రావు కోరారు.
శ్రీరామ నవమి పండుగ అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా న్యూట్రిషన్ కిట్స్ అందిస్తాం అని మంత్రి హరీశ్రావు వెల్లడించారు.
బిడ్డ పుట్టగానే కేసీఆర్ కిట్స్, బిడ్డ పుట్టక ముందే న్యూట్రిషన్ కిట్ అందజేస్తామని ప్రకటించారు. పేద మహిళల కోసం ఆలోచించి ముఖ్యమంత్రి దీన్ని ప్రారంభిస్తున్నారని స్పష్టం చేశారు. నెయ్యి, ప్రోటీన్ మిక్స్ పౌడర్, కర్జూర పండ్లు, గోళీలు ఉంటాయన్నారు. పిల్లలు ఆరోగ్యంగా పుట్టాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని అందరు గర్బిణులకు ఇవ్వబోతున్నాం అని ప్రకటించారు. ఎవరూ అడగకముందే, సీఎం కేసీఆర్ మహిళల కోసం ఆరోగ్య మహిళ, కేసీఆర్ కిట్స్, న్యూట్రీషన్ కిట్స్, ఆరోగ్య మహిళ, కల్యాణ లక్ష్మీ, ప్రత్యేక గురుకులాలు.. ఇలా అనేక కార్యక్రమాలు ప్రారంభించారని హరీశ్రావు గుర్తు చేశారు.
వడ్డీ లేని రుణాలు రూ. 750 కోట్ల రుణాలు విడుదల చేసినట్లు మంత్రి హరీశ్రావు తెలిపారు. మీ ఖాతాల్లో జమ చేస్తున్నారు. మిగిలిన మొత్తం రెండో దఫాగా జూన్ నెలలో ఇస్తామని చెప్పారు.
మాది న్యూట్రిషన్ పాలిటిక్స్ అయితే.. బీజేపీది పార్టీషన్ పాలిటిక్స్ అని మంత్రి విమర్శించారు. కులం, మతం పేరుతో వారు విభజన చేయాలని చూస్తే, మేము సంక్షేమం కోసం ఆలోచన చేస్తున్నాం అని స్పష్టం చేశారు. కర్ణాటక, మహారాష్ట్ర ఏ రాష్ట్రానికి పోయినా, తెలంగాణ వంటి పథకాలు అమలు చేయాలని అడుగుతున్నారని తెలిపారు. తెలంగాణ పథకాలు అమలు చేయకుంటే, తమ ప్రాంతాలను తెలంగాణలో కలపాలని కోరుతున్నారని హరీశ్రావు తెలిపారు.