హైదరాబాద్: రాష్ట్రంలో విద్య, వైద్యంపై ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) దృష్టిసారించారని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. పదేండ్లలో వైద్యరంగానికి రూ.73 వేల కోట్లు కేటాయించామని చెప్పారు. ఈ ఒక్క ఏడాదే రూ.12 వేల కోట్లకుపైగా కేటాయించామని తెలిపారు. అసెంబ్లీలో వైద్యారోగ్య శాఖపై జరిగిన స్వల్పకాలిక చర్చకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వైద్యారోగ్య శాఖపై చేసిన విమర్శలను తిప్పికొట్టారు. ఐదేండ్లలో రెండుసార్లు కరోనా రావడంతో అనుకున్న ప్రణాళికలు అతలాకుతలమయ్యాయన్నారు. విద్యా, వైద్యంపై ప్రత్యే ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదని చెప్పారు. 2013-14లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం వైద్యారోగ్య శాఖకు రూ.2706 కోట్లు మాత్రమే బడ్జెట్ కేటాయించిందని వెల్లడించారు. అయితే తాము ఈ ఏడాది బడ్జెట్లో రూ.12,364 కోట్ల నిధులు కేటాయించామన్నారు.
ప్రజలకు స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం అందించగలుగుతున్నామని వెల్లడించారు. గతంలో మాదిరిగా మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు తీవ్రంగా లేవని చెప్పారు. పల్లెప్రగతి, పట్టణప్రగతి వల్ల పారిశుద్ధ్యం మెరుగుపడిందన్నారు. పల్లె దవాఖానలు, బస్తీ దవాఖానల పేరుతో ప్రాథమిక దశ నుంచి వైద్యం అందిస్తున్నామని చెప్పారు.