హైదరాబాద్: దేశంలో అత్యధికంగా వేతనం తీసుకుంటున్న ఆశా వర్కర్లు (Asha workers) తెలంగాణలోనే ఉన్నారని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. ఆశా వర్కర్ల మొబైల్ బిల్లులను ప్రభుత్వమే భరిస్తున్నదని చెప్పారు. బస్తీ దవాఖానలతో (Basti Dawakhana) ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని మంత్రి హరీశ్ రావు అన్నారు. హైదరాబాద్ శిల్పకళావేదికలో కొత్తగా ఎంపికైన 15 వేల మంది ఆశావర్కర్లకు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీతో కలిసి మంత్రి హరీశ్ రావు నియామక పత్రాలు అందేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఒకప్పుడు ఏ రోగం వచ్చినా గాంధీ, ఉస్మానియా దవాఖానలకు వెళ్లేవాళ్లమని.. స్వరాష్ట్రంలో ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) హైదరాబాద్లో 350 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశారని వెల్లడించారు. దీంతో ఉస్మానియా, గాంధీ హాస్పిటళ్లలో ఓపీ శాతం తగ్గిందని చెప్పారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మూడు ఎంసీహెచ్ సూపర్ స్పెషాలిటీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి హరీశ్ చెప్పారు. కేసీఆర్ కిట్తో మాతా శిశు మరణాలను తగ్గించామని చెప్పారు. పైసా ఖర్చు లేకుండా టీ-డయాగ్నొస్టిక్స్లో ఉచితంగా 134 పరీక్షలు చేస్తున్నామని చెప్పారు.
ఆశావర్కర్ల సేవలు మరచిపోలేనివని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణలోని ఆరోగ్య సేవలు దేశానికే ఆదర్శమన్నారు. ప్రజలు ప్రభుత్వ దవాఖానలవైపు మొగ్గు చూపుతున్నారని చెప్పారు. కరోనా సమయంలో ఆశావర్కర్ల సేవలు విశేషమైనవని తెలిపారు. తెలంగాణకు అసలైన డాక్టర్.. మంత్రి హరీశ్ రావు అని వెల్లడించారు. రాష్ట్రంలో ఆశా వర్కర్లకు రూ.9,750 వేతనం ఇస్తున్నామన్నారు.