Harish Rao | సిద్దిపేట : బీఆర్ఎస్ పార్టీ అధినతే కేసీఆర్ నిఖార్సయిన హిందువు.. ఆయనకున్న దైవభక్తి మూలంగా రాష్ట్రం సుభిక్షంగా ఉందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామంలో సీతారామ చంద్రస్వామి ఆలయాన్ని మంత్రి హరీశ్రావు సందర్శించారు. ఈ సందర్భంగా స్వామి వారిని దర్శించుకున్నారు. అనంరతం రూ.40 లక్షల నిధులతో ఆలయ పునరుద్ధరణ పనులకు మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. కేసీఆర్ నిఖార్సయిన హిందువు కాబట్టే రాష్ట్రంలోని దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. రూ.1200 కోట్లతో యాదాద్రి టెంపుల్ను అభివృద్ధి చేశారు. రూ. 600 కోట్లతో కొండగట్టు అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. అర్చకులకు జీతాలు, ఆలయాల అభివృద్ధి కొరకు చర్యలు తీసుకుంటున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే అని స్పష్టం చేశారు.
10 000 దేవాలయాల్లో దూపాదీప నైవేద్యం కొరకు రూ.6000 వేలను రూ.10, 000కు పెంచి ఇస్తున్నామని హరీశ్రావు తెలిపారు. పోట్లపల్లి గ్రామంలో 140 దేవాలయాలు ఉన్నాయని, అలాంటి గ్రామంలో రూ.40 లక్షలతో రామాలయ పునరుద్ధరణ పనులు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. శివాలయ గాలి గోపురం నిర్మాణానికి రూ.50 లక్షల రూపాయల నిధులను మంజూరు చేస్తానని తెలిపారు. కేసీఆర్ హయాంలో గత 9 సంవత్సరాల నుంచి గుంట కూడా ఎండకుండా పంటలు పండుతున్నాయని చెప్పారు. ఒకనాడు తిండి గింజలకు తిప్పలు పడ్డ మనం.. ఇవాళ రెండు పంటలు పండిస్తూ దేశానికే అన్నం పెట్టె అన్నపూర్ణగా ఎదిగాం. ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక గౌరవెల్లి ప్రాజెక్ట్ కట్టి నీళ్లు తెచ్చింది కేసీఆర్ అని మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, స్థానిక శాసనసభ్యులు ఒడితెల సతీష్ కుమార్, జెడ్పి చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.