హైదరాబాద్: మారిన జీవనశైలి, ఆహార అలవాట్ల వల్ల చిన్నతనంలోనే ప్రజలు రోగాల బారిన పడుతున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రపంచాన్ని భయపెడుతున్న రొమ్ము క్యాన్సర్ విషయంలోనూ ఇదే జరుగుతుందన్నారు. ఒకప్పుడు పెద్ద వయస్సులో మాత్రమే కనిపించే ఈ మహమ్మారి నేడు 30-40 ఏండ్ల వయస్సు వారిలోనూ కనిపిస్తున్నది ఆందోళన వ్యక్తంచేశారు. వరల్డ్ బ్రెస్ట్ర్ క్యాన్సర్ నెల సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్రోడ్లోని జలవిహార్ వద్ద నిర్వహించిన అవగాహన నడన, మారథాన్ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రొమ్ము క్యాన్సర్పై అవగాహన కల్పించడంలో భాగంగా మారథాన్ నిర్వహించడం మంచి ఆలోచన అన్నారు. జిల్లాల్లోనూ ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. చాపకింద నీరులా విస్తరిస్తున్న రొమ్ము క్యాన్సర్ గురించి ప్రజలకు అవగాహన కల్పించి, ప్రజలను కాపాడేందుకు ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ నెలను బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా నిర్వహిస్తున్నారని చెప్పారు. మారథాన్లో పాల్గొన్నవారికి అభినందనలు తెలిపారు.
గత ఐదేండ్లలో చూస్తే దేశంలో బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయని చెప్పారు. గర్భాశయ క్యాన్సర్ కంటే ఈ కేసులే ఎక్కువగా ఉంటున్నాయని వెల్లడించారు. 40-50 ఏండ్ల మధ్య వయస్సు గల మహిళలు ఎక్కువగా రొమ్ము కేన్సర్ బారిన పడుతున్నారు. వ్యాధికి సంబంధించిన అవగాహన లేకపోవడంతో అడ్వాన్స్డ్ దశలో నిర్ధారణ జరుగుతుందని, దీంతో చికిత్స అందించడం కష్టంగా ఉంటున్నదని తెలిపారు. 70 శాతం కేసుల విషయంలో ఇలా జరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయన్నారు. ప్రారంభదశలోనే వ్యాధిని గుర్తిస్తే వంద శాతం ప్రాణాలు కాపాడవచ్చన్నారు. జంక్ ఫుడ్, ప్లాస్టిక్ వినియోగం, శారీరక శ్రమ లేకపోవడం వంటి అంశాలు వ్యాధికి కారణమవుతున్నాయని చెప్పారు. మహిళల్లో కాన్సర్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయన్నారు.
క్యాన్సర్ నియంత్రణ పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నదని మంత్రి చెప్పారు. మొబైల్ స్త్రీనింగ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. లక్షణాలు ఉన్నవారిని గుర్తించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఒక్కో నెలలో సగటున ఆరు క్యాంపులు నిర్వహించి 800 మంది వరకు పరీక్షలు చేస్తున్నామన్నారు. నిర్ధారణ అయిన వారిని మెరుగైన చికిత్స కోసం ఎంఎన్జే దవాఖానకు పంపిస్తున్నామని వెల్లడించారు. చికిత్స విషయంలో ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నదని పేర్కొన్నారు.
క్యాన్సర్ చికిత్స పై తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం రు. 750 కోట్లు వెచ్చించిందని వెల్లడించారు. అన్ని రకాల క్యాన్సర్లకు సమగ్రమైన చికిత్సలు అందిస్తున్నది చెప్పారు. ఎంఎన్జేలో కొత్తగా రూ.30 కోట్లతో ఎనిమిది మాడ్యులర్ థియేటర్లు ప్రాంభించామన్నారు. ఇందులో ఒకటి రోబోటిక్ థియేటర్ కావడం విశేషమన్నారు. ఎంఎన్జే దవాఖానను రూ.120 కోట్లతో స్టేట్ క్యాన్సర్ సెంటర్గా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.