మెదక్: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీల కార్డ్ సంతకం లేని పోస్ట్డేటెడ్ చెక్ (Post dated Cheque) లాంటిదని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏమీ చేయకుండా తెలంగాణలో (Telangana) అమలు కాని హామీలు ఇస్తున్నారని విమర్శించారు. గద్దెనెక్కే వరకు కాంగ్రెస్ (Congress) వాళ్లు ఏదైనా చెబుతారన్నారు. అధికారం కోసం డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు.. లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అధికారంలోకి రామని తెలిసి ఏదైనా మాట్లాడుతూ కాంగ్రెస్ వాళ్ళు ప్రజల్ని మోసం చేస్తున్నారన్నారు. 6 గ్యారెంటీ హామీలు అని చెబుతున్న కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 6 నెలలకు ఒక సీఎం వస్తాడని ఎద్దేవా చేశారు. హైదరాబాద్లో (Hyderabad) ప్రతి 6 నెలలకు ఒకసారి కర్ఫ్యూ వస్తుందన్నారు. 24 గంటల కరెంట్ పోయి రోజుకు ఆరు గంటల కరెంట్ మాత్రమే వస్తుందని, వారానికి రెండు రోజుల పవర్ హాలిడే ఇస్తారని విమర్శించారు.
కాంగ్రెస్ వాళ్లకు కొత్తగా బెంగుళూరు హై కమాండ్ వచ్చిందని ఎద్దేవా చేశారు. బెంగుళూరును తెలంగాణకు రెండో రాజధాని చేస్తరు కావచ్చని చెప్పారు. ఇకపై ఢిల్లీకి బెంగుళూరు మీదుగా వెళ్లాల్సి వస్తుందేమోనని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, వారి బోనస్ మాటలు నమ్మి అగం కావద్దుని సూచించారు. కన్నతల్లికి అన్నం పెట్టలేనోడు.. పినతల్లికి బంగారు గాజులు కొనిస్తా అన్నట్టు కాంగ్రెస్ పార్టీ తీరు ఉందని విమర్శించారు. ఎంత సేపు కేసీఆర్ని తిట్టుడే తప్ప వాళ్లకు మరో పనిలేదన్నారు.
కేసీఆర్ (CM KCR) అంటే నమ్మకానికి మారుపేరన్నారు. చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకున్న వ్యక్తి సీఎం కేసీఆర్ అని తెలిపారు. రూపాయి ఖర్చు లేకుండా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి ఇచ్చామని వెల్లడించారు. పనిచేసే ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలన్నారు. బీఆర్ఎస్ మానిఫెస్టో గొప్పగా ఉంటదని, చెప్పిన ప్రతి హామీ నెరవేర్చామని మంత్రి హరీశ్ రావు అన్నారు.