NIMS | హైదరాబాద్ : నిమ్స్ దవాఖాన విస్తరణ పనులకు సీఎం కేసీఆర్ వచ్చే నెలలో శంకుస్థాపన చేయనున్నట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. కొత్తగా 2,000 పడకలతో సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను అందించే లక్ష్యంతో విస్తరణ పనులను చేపడుతున్నామని చెప్పారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఏరియా హాస్పిటల్లో డయాలసిస్ కేంద్రం, బ్లడ్ బ్యాంక్ను గురువారం మంత్రి హరీశ్రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. నగరం నలువైపులా గచ్చిబౌలి, సనత్నగర్, అల్వాల్, ఎల్బీనగర్లో నిర్మించనున్న టిమ్స్ దవాఖానల పనులను వేగవంతం చేస్తామన్నారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలకు పేదల ఆరోగ్యం పట్టలేదని మండిపడ్డారు. బ్రిటిష్ కాలంలో, నిజాం కాలంలో ఏర్పాటు చేసిన గాంధీ, ఉస్మానియా, నిమ్స్ తప్ప ఏడు దశాబ్దాల పాలనలో ఒక్క సూపర్ స్పెషాలిటీ దవాఖాన కట్టలేదని మండిపడ్డారు. కానీ.. సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించేందుకు కొత్తగా నాలుగు టిమ్స్ (4 వేల పడకలు) నిర్మిస్తున్నారని, నిమ్స్ దవాఖాన విస్తరణ (2 వేల పడకలు) చేపట్టారని తెలిపారు. తద్వారా ఏకంగా ఆరువేల పడకలు అదనంగా అందుబాటులోకి రానున్నట్టు వెల్లడించారు. దీంతోపాటు వరంగల్లో ఏర్పాటు చేస్తున్న హెల్త్ సిటీ పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. అత్యవసర సమయాల్లో ఉత్తమ వైద్యం అందించేందుకు ట్రామా కేర్ సెంటర్లను బలోపేతం చేయనున్నట్టు మంత్రి తెలిపారు. లెవల్ 1, 2, 3గా వర్గీకరించి అత్యాధునిక సదుపాయాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. కార్పొరేట్ తరహాలో అత్యవసర సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
గర్భిణులు, పుట్టబోయే పిల్లల ఆరోగ్యం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ను ఒకటి రెండు వారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని మంత్రి హరీశ్రావు తెలిపారు. మొత్తం 6.5 లక్షల మంది గర్భిణులకు ప్రయోజనం కలుగనున్నట్టు చెప్పారు. ఇందుకోసం బడ్జెట్లో సీఎం కేసీఆర్ రూ.250 కోట్లు కేటాయించారని చెప్పారు. ఇప్పటికే లక్ష కిట్లు జిల్లాలకు పంపించామని, మరో లక్ష కిట్లు సేకరిస్తున్నామని వెల్లడించారు. అవి రాగానే పంపిణీని ప్రారంభిస్తామని హరీశ్రావు ప్రకటించారు.