హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) పాలన సంక్షేమానికి స్వర్ణయుగం అని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో అత్తా కోడళ్ల పంచాయితీలు బందయ్యాయని చెప్పారు. వృద్ధులు, వికలాంగులకు ఆత్మగౌరవం పెంచారని తెలిపారు. గాంధీ భవన్లో కూర్చుంటే కాంగ్రెస్ (Congress) వాళ్లకు అర్థంకాదని, ఊర్లోకి వచ్చి అవ్వ, తాతలను అడిగితే తెలుస్తుందన్నారు. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా సిద్దిపేటలో నిర్వహించిన సంక్షేమ ఉత్సవాలకు మంత్రి హరీశ్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణలో తప్పా బీడీ కార్మికులకు ఏ రాష్ట్రంలోనైనా పెన్షన్ ఇస్తున్నారా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ సంపద పెంచి పేదలకు పంచారని చెప్పారు. పెద్ద కొడుకులా వృద్ధులకు పెన్షన్లు అందిస్తున్నారని చెప్పారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో పేదింట్లో వెలుగులు నిండాయన్నారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు 12 లక్షల 71 వేల మంది ఆడబిడ్డలకు మేనమామలా పెండ్లి చేశారని తెలిపారు. తొమ్మిదేండ్లలో ఆసరా పెన్షన్ల కింద 59 వేల కోట్లు అందించామన్నారు. అన్ని కులాలకు సంక్షేమ భవనాలు నిర్మిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో రెండు, మూడు రోజులకు ఒకసారి మంచి నీళ్లు వచ్చేవి, ఇప్పుడు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి సురక్షిత మంచి నీళ్లు ఇస్తున్నామని వెల్లడించారు. నేరుగా పొయ్యి దగ్గరకే తాగునీరు వస్తున్నదని స్పష్టం చేశారు.
సిద్దిపేటలో 12 రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటుచేశామన్నారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో చదివిన విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో సీట్ల కోసం పోటీ ఏర్పడిందన్నారు. సిద్దిపేటను ఎడ్యుకేషన్ హబ్గా మార్చామని వెల్లడించారు. పట్టణంలోని కోమటి చెరువు సర్వాంగ సుందరంగా తయారైందని, చెరువ వద్ద త్వరలో డైనోసర్ పార్క్ను ఏర్పాటుచేస్తామన్నారు.
ప్రభుత్వ దవాఖానల్లో 33 వేల పడకలు ఏర్పాటు చేశామని మంత్రి అన్నారు. తొమ్మిదేండ్లలో 21 మెడికల్ కాలేజీలు ఏర్పాటుచేశామని తెలిపారు. వైద్య కళాశాలలు తెచ్చామని బీజేపీ నాయకులు అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ నాయకుల తీరు సొమ్ము ఒకడిది.. సోకు మరొకడిది అన్నట్లు ఉందని విమర్శించారు. బండి సంజయ్ కరీంనగర్కు మెడికల్ కాలేజీ తెచ్చాడా అని ప్రశ్నించారు. అబద్ధాల బీజేపీ నాయకులు బేషరతుగా క్షమాపణలు చేప్పాలని డిమాండ్ చేశారు. చిత్తశుద్ధి ఉంటే విభజన హామీలను అమలు చేయాలన్నారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలని వెల్లడించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులవి నరం లేని నాలుకలని విమర్శించారు.